ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి న్యూ ట్రిక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 07:33 PM

తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను పెంచారు. వాహనదారుడు మితిమీరిన వేగంతో వెళ్లడం, సిగ్నల్ జంపింగ్ వంటి తప్పిదాలకు పోలీసులు నేరుగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే.. కొంతమంది వాహనదారులు ఈ చలాన్లను తప్పించుకోవడానికి వింత పద్ధతులు అవలంబిస్తున్నారు. వాహన నంబర్ ప్లేట్లను మార్చడం.. వాటిలో నుంచి ఒక అంకె తొలగించడం.. వాటి స్థానంలో రాజకీయ నినాదాలు లేదా నేతల పేర్లు రాయడం లాంటి పనులు చేస్తున్నారు. పట్టుబడినపుడు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు.


ఇక మరికొందరు నంబర్ స్పష్టంగా కనిపించకుండా పేపర్ అంటించడం, మట్టి రాసేయడం, వెనక్కి తిరిగి కాళ్లు పెట్టడం లేదా చేతులు కప్పేయడం వంటి ప్రమాదకర చర్యలకు కూడా వెళ్తున్నారు. ఈ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వాహనం ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక నంబర్‌లో సగ భాగం మాత్రమే కనిపించేలా దాచేస్తే పోలీసులు వెతికినా యజమాని ఎవరో కనుక్కోలేని స్థితి వస్తోంది. ఇలాంటి పనులకు పాల్పడుతూ చాలా మంది ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు.


కొత్త వాహనం కొన్నప్పుడు మొదట తాత్కాలిక టీఆర్ నంబర్ వస్తుంది. నెలలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ కొందరు ఏళ్ల తరబడి టీఆర్ నంబర్‌తోనే వాడుతున్నారు. ఈ టీఆర్ నంబర్ ద్వారా అయితే చలాన్లు విధించే అవకాశం ఉండదు అనే కారణంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని పోలీసులు గుర్తించినప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాన్సువాడలో పెద్ద మోసం బయటపడింది. హైదరాబాద్ నుంచి దొంగతనం చేసిన వాహనాలను తక్కువ ధరకు స్థానికులకు అమ్మేశారు.


సరైన పత్రాలు లేకపోయినా చవకైన ధరకు వాహనం వస్తుందని నమ్మిన వారు మోసపోయారు. తనిఖీల్లో ఆ వాహనాలు పట్టుబడటంతో పోలీసులు అసలు కథ బయటపెట్టారు. అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ.. పత్రాలు సరిగా లేని వాహనాలు కొనకూడదని సూచించారు. బాన్సువాడ సీఐ అశోక్ మాట్లాడుతూ.. వాహనాల తనిఖీలు కఠినంగా కొనసాగుతున్నాయి.. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు తప్పవు.. పత్రాలు లేకుంటే వాహనం స్వాధీనం చేసుకుంటాం.. నంబర్ తప్పు అయితే నేరుగా కేసు నమోదు చేస్తా అని స్పష్టం చేశారు. ఎక్కువగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa