హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల కీలక సూచన. వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా నగరంలో వారం రోజుల పాటు వాహన రాకపోకలకు ప్రత్యేక ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటన ప్రకారం.. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు నిమజ్జన ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ల వద్ద విగ్రహాల నిమజ్జనం జరగనుండటంతో భారీ వాహనాల రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల పలు ప్రధాన రహదారుల్లో వాహనాల ప్రవేశంపై నియంత్రణ అమలు చేస్తారు.
సెయిలింగ్ క్లబ్ జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, కవాడిగూడ ఎక్స్ రోడ్, డీబీఆర్ మిల్స్, నల్లగుట్ట బ్రిడ్జి, బుద్ధ భవన్, వీవీ విగ్రహం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా సమయాల్లో వాహనదారులు లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రత్యామ్నాయ రూట్లు ఎంచుకోవాలని అధికారులు సూచించారు. అదనంగా, బేగంపేట్, మినిస్టర్ రోడ్, కవాడిగూడ వైపు వచ్చే వాహనాలు ప్రత్యేక మార్గాల ద్వారా మళ్లించనున్నారు.
రహదారులపై పర్యవేక్షణ..
నగరంలోని ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్బండ్ వద్ద వాహన నియంత్రణ అమలు చేసి.. అవసరాన్ని బట్టి కఠిన ఆంక్షలు విధిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వాహనదారులు ముందస్తుగా మార్గాలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అదనపు సిబ్బందిని నియమించి, రహదారులపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ నిర్వహించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 90102 03626 ద్వారా సహాయం పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు. నగరంలో సజావుగా నిమజ్జనం జరిగేలా ట్రాఫిక్ విభాగం సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. పోలీసులకు భక్తులు సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa