తెలంగాణ రవాణా రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇకపై రాష్ట్రంలో చెక్పోస్టులు కనిపించవు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాహనాలకు సరుకు రవాణా సమయాన్ని తగ్గించడమే కాకుండా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ అమలు తర్వాత చెక్పోస్టుల అవసరం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా పలు రాష్ట్రాలు తమ చెక్పాయింట్లను ఎత్తివేయగా.. తాజాగా తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది.
రవాణాశాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా మొత్తం 14 చెక్పోస్టులు, అందులో కామారెడ్డి చెక్పాయింట్ కూడా ఉండగా.. వీటిని అధికారికంగా రద్దు చేస్తున్నారు. ఇకపై వాహన పన్నులు, తాత్కాలిక అనుమతులు, ఇతర రుసుములన్నీ ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం కల్పించారు.
అయితే వీటిని తనిఖీ చేసే పనికి ప్రభుత్వం ఆరు నెలలపాటు ప్రత్యేక మొబైల్ స్క్వాడ్లను నియమించాలని రవాణాశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొబైల్ స్క్వాడ్లు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తాయి. ఈ నిర్ణయం కారణంగా చెక్ పోస్టుల వద్ద అవినీతికి చెక్ పెట్టినట్లైంది. ఈ రంగంలో పారదర్శకతను పెంచడం.. వాహనదారులకు త్వరగా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.
అదనంగా.. నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించేందుకు ఏఎన్పీఆర్ (ఆటో నంబర్ ప్లేట్ రీడర్) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి చెక్పోస్టు వద్ద ప్రయోగాత్మకంగా ఈ- కెమెరాలను అమర్చారు. వాటి సహాయంతో ఉల్లంఘనలు జరిపిన వాహనాలను ట్రాక్ చేసి చర్యలు తీసుకునేందుకు హ్యాండ్హెల్డ్ పరికరాలు అధికారులకు ఇవ్వనున్నారు.
చెక్పోస్టుల రద్దు అమలు తేదీని రవాణాశాఖ కమిషనర్ నిర్ణయించనున్నారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేసి, సరకు రవాణా వాహన యజమానుల సంఘాలకు అవగాహన కల్పించిన అనంతరం ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కొత్త విధానం వల్ల రవాణా సమయం తగ్గి వ్యాపార వ్యవహారాలు మరింత వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa