తెలంగాణలోని రేషన్ డీలర్లు .. ప్రజలు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ తర్వాత.. వచ్చే నెల అనగా సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ రేషన్ పంపిణీ మొదలు కావాల్సి ఉంది. దీనికి మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉండగా.. చివరి నిమిషంలో రేషన్ డీలర్లు ఊహించని షాకిచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అసలేం జరిగింది.. ఎందుకు రేషన్ డీలర్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే..
పెండింగ్ బకాయిల విడుదల కోసం రేషన్ డీలర్లు పోరు బాట పట్టారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేసేది లేదని తేల్చి చెప్పారు. బియ్యం పంపిణీ కమీషన్ బకాయిల విడుదల గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోతుందని.. ఈ సమస్య పరిష్కారం కోసమే తాము సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
రేషన్ బియ్యం పంపిణీ బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతూ.. గురువారం నాడు రేషన్ డీలర్లు.. రాష్ట్ర పౌరసరఫరాల భవన్ ఎదుట నిరసన తెలిపారు. ఈక్రమంలోనే సెప్టెంబర్ 1న రేషన్ దుకాణాల బంద్ గురించి వారు ప్రకటన చేశారు. అలానే వారి ఆందోళనకు సంబంధించిన కార్యాచరణను కూడా ఈ సందర్బంగా వెల్లడించారు. బకాయిల విడుదల విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే.. సెప్టెంబర్ 4వ తేదీన రేషన్ డీలర్లంతా అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలానే రేషన్ బియ్యం పంపిణీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. ఇప్పటికే తాము అన్ని జిల్లాల కలెక్టర్లకు, సివిల్ సప్లై అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు.
రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి.. ప్రభుత్వం రేషన్ డీలర్లకు సుమారు ఐదు నెలల కమీషన్ బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి డీలర్లకు కమిషన్ బకాయిలను చెల్లించలేదు. అలానే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కమీషన్ కూడా చెల్లించలేదని డీలర్లు తెలిపారు. అంతకు ముందు రెండు నెలల కమీషన్ కూడా చెల్లించలేదన్నారు. దీనికి సంబంధించి నెలకు రూ.25 కోట్ల చొప్పున.. 5 నెలలకు కలిపి 125 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ పెండింగ్ బకాయిలను చెల్లిస్తేనే.. వచ్చే నెల రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. మరి ప్రభుత్వం వీరి డిమాండ్ మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa