ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి.. సంబరాలు చేసుకున్న గ్రామస్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 07:40 PM

తెలంగాణలో అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ ఇటీవల తన దూకుడును పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసిన ప్రతిసారీ.. బాధితులు నేరుగా ఏసీబీని సంప్రదిస్తున్నారు. దీనితో అవినీతిపరులపై వరుస చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆయన ఒక ఇంటి నిర్మాణానికి హౌస్ నెంబర్ ఇవ్వాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనితో బాధితుడు ఏసీబీని సంప్రదించగా.. డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందం అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన తెలుసుకున్న గ్రామస్తులు కార్యాలయం వద్ద చేరి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు.


ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు. గత మూడు నెలల్లో ఏసీబీ తెలంగాణలో 40కి పైగా లంచాల కేసులను నమోదు చేసింది. వీటిలో పలు సందర్భాల్లో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ శాఖ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. కేవలం హైదరాబాదులోనే 10 కేసులు బయటపడ్డాయి. నల్లగొండ, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఇలాంటి కేసులు బహిర్గతమయ్యాయి. ప్రతి కేసులోనూ అధికారులు నగదు స్వీకరిస్తున్నప్పుడు ఏసీబీ బృందాలు ప్రత్యక్ష సాక్ష్యాలతో పట్టుకున్నాయి.


ప్రజలు కూడా ఈ పోరాటంలో చురుకుగా ముందుకొస్తున్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోమని భరోసా ఇస్తున్నారు. అందువల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగి, ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి.


అధికారుల అంచనా ప్రకారం.. గతంలో కంటే ఇప్పుడు ఫోన్ కాల్స్ 30 శాతం ఎక్కువ వస్తున్నాయి. ఈ సమాచారం ఆధారంగా ఏసీబీ దాడులు వేగంగా సాగుతున్నాయి. అవినీతి తిమింగలాలను బయటపెట్టడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు అధికారులు. లంచాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే.. వారితో కలిసి ప్రజలు లంచాలు ఇవ్వొద్దని.. దీని వల్ల వారిని ప్రోత్సహించిన వారు అవుతారని.. లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఇక మొత్తం మీద.. తెలంగాణలో ఏసీబీ దూకుడు కారణంగా ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిపరులకు చెక్ పడుతోంది. అవినీతిని అరికట్టడంలో ఇది ఒక సానుకూల పరిణామంగా పరిగణించబడుతోంది. డబ్బుతో ఏసీబీకి చిక్కితే బెయిల్ లేకుండా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa