తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని సడలించే దిశగా ముందడుగు వేసింది. రిజర్వేషన్ల విషయంలో పరిమితిని ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ చర్చల అనంతరం.. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా బీసీ వర్గాల వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు విస్తరించనున్నాయి.
దీనికి ప్రభుత్వం ముందుగా పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)లో సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పుతో పంచాయతీ ఎన్నికలలో బీసీ వర్గాల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. స్థానిక సంస్థలలో బీసీలకు ఎక్కువ స్థానాలు లభించడం ద్వారా సామాజిక సమానత్వం బలోపేతం అవుతుంది. తర్వాత.. ప్రభుత్వం 50 శాతం సీలింగ్ తొలగింపుపై చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే యత్నం చేయనుంది. దీని ఫలితంగా బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పరిమితి తొలగించబడితే.. వెనుకబడిన వర్గాలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
అయితే.. ఆర్డినెన్స్ రూపంలో తీసుకువెళ్లిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఈ మార్పులను అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంది. దీని కోసం అవసరమైన ఫైల్స్ సిద్ధం చేసి.. అమలు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. జీవో అమల్లోకి రాగానే.. బీసీ వర్గాలకు విద్యాసంస్థలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఈ నిర్ణయం ఒక విధాన పరమైన మార్పుగా భావించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ అడుగు.. ఇతర రాష్ట్రాలకు కూడా ఒక మోడల్గా నిలిచే అవకాశం ఉంది. భవిష్యత్లో రిజర్వేషన్ల విస్తరణకు ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa