తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్న్యూస్. రేపటి నుంచి (సెప్టెంబర్ 1) రాగి జావ పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే సుమారు 18 లక్షల మంది విద్యార్థులకు ఈ రాగిజావ అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ఈ పథకం అమలు చేయనున్నారు. రాగిజావ తయారీకి అవసరమైన రాగి పౌడర్, బెల్లం పౌడర్ను ఈ ట్రస్ట్ పాఠశాలలకు సరఫరా చేస్తోంది. ప్రతి గ్లాస్ రాగిజావ తయారు చేసి అందించినందుకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు రోజుకు 25 పైసల చొప్పున చెల్లించనున్నారు.
ఈ పథకం కోసం ఏటా సుమారు రూ.35 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇందులో 60 శాతం ఖర్చును శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భరిస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహార విలువలు ఉన్న ఆహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 వేల బడుల్లో 'పీఎం పోషణ్' కింద మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దీనితో పాటుగా వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజులు రాగిజావ ఇస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం జూన్ 12న పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ.. రాగిజావ పంపిణీలో సుమారు రెండున్నర నెలల ఆలస్యం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ ఆమోదం కోసం చాలా కాలం పెండింగ్లో ఉంది. దీనికి తోడు, విద్యా శాఖ అధికారులు కూడా తగినంత శ్రద్ధ చూపలేదని తెలుస్తోంది. ఈ ఆలస్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి పెరిగింది. దాని ఫలితంగా గత నెలలో ఆర్థిక శాఖ ఫైలుకు ఆమోదం తెలిపింది. అయినప్పటికీ విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడానికి మరో నెలన్నర సమయం తీసుకున్నారు. ఈ జాప్యం వల్ల విద్యార్థులు ఈ రెండున్నర నెలల పాటు రాగిజావను కోల్పోయారు.
తాజాగా సెప్టెంబర్ 1 నుంచి రాగిజావ పంపిణీని ప్రారంభించాలని ఉత్తర్వులు వెలువడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పథకాల అమలులో జాప్యం జరగకుండా చూడాలని, సరైన సమయంలో నిధులు విడుదల చేసి విద్యార్థులకు పోషకాహారం అందించాలని పలువురు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa