తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థలన్నింటిలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గట్టిగా సంకల్పించామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అనంతరం ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని.. గత ప్రభుత్వం చేయలేని పని తమ ప్రభుత్వం చేసిందని పొన్నం వ్యాఖ్యానించారు. అనంతరం జోక్యం చేసుకున్న గంగుల.. బీసీలపై పొన్నం ప్రభాకర్కు అవగాహన లేదని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పారు.
బీసీ బిల్లును బీఆర్ఎస్ సంపూర్ణంగా స్వాగతించిందని.. శాస్త్రీయ పరంగా చేయాలని మాత్రమే కోరుతున్నామని గంగుల కమలాకర్ వ్యాఖ్యనించారు. వెనుకబడిన కులాలను మోసం చేయవద్దని ఆనాడే చెప్పామని.. తమ సూచనలు పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి చిక్కులు ఉండవని చెప్పామన్నారు. జీవో ఇవ్వకుండా 22 నెలలు ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుమారు 6 కమిటీలు వేశారని.. 2024 మార్చిలో బీసీ కమిషన్ ద్వారా జీవో తీసుకొచ్చాన్నారు. తదనంతరం బీసీ కమిషన్ మాయమైందన్నారు. తర్వాత జీవో నెం. 18 తీసుకొచ్చారని.. ప్లానింగ్ డిపార్టుమెంట్ ద్వారా సర్వే చేస్తామన్నారన్నారు. అనంతరం కలుగజేసుకున్న మంత్రి పొన్నం గంగుల కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. తనకు సబ్జెక్ట్ లేదని అనటం గంగుల అవివేకమన్నారు. ఆకారం ఎక్కువగా ఉంటే.. అవగాహన ఎక్కువ ఉందనుకుంటే పొరపాటన్నారు. గంగుల తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. మంత్రి శ్రీధర్ బాబు సైతం గంగుల కామెంట్లను వెనక్కి తీసుకోవాలని కోరారు.
అనంతరం మైక్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బలహీనవర్గాలకు అనుమానం కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని కోరారు. మొత్తం వివరాలు సేకరించేందుకు బీసీ కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. బీసీల్లో అపోహలు సృష్టించే విధంగా గంగుల మాట్లాడుతున్నారన్నారు. బీసీ బిల్లుపై గంగులకు సంపూర్ణ అవగాహన ఉందని భావిస్తున్నానని చెప్పారు. వాళ్ల పార్టీ ఆదేశాలకు అనుగుణంగా గంగుల కమలాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. కేసీఆర్ది కల్వకుంట్ల కుటుంబం కాదని.. ఎవర్ని కలవకుండా చేసే కుటుంబం అని అన్నారు. బీసీలు ఓసీలు కలవొద్దు.. ఎస్టీలు, ఎస్సీలు కలవొద్దు.. మైనార్టీలు, క్రైస్తవులు కలవొద్దని కోరుకునే కుటుంబం అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక జస్టిస్ పి.సి.ఘోష్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు కాళేశ్వరం కమిషన్ నివేదికను పెన్డ్రైవ్లో అందజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa