ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకొక్కరు రూ.10 లక్షల చొప్పున..బాధితులకు అండగా తెలంగాణ బీజేపీ ఎంపీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 04:39 PM

తెలంగాణ రాష్ట్రం గత వారంలో రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కురిసిన కుంభవృష్టి వర్షాలు ప్రజలను చిగురుటాకులా వణికించాయి. పట్టణంలోని వందలాది కాలనీలు నీటమునిగిపోయి. ప్రజలు దాదాపు రెండు రోజులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్జీవో, జీఆర్ కాలనీల్లో 12 అడుగుల ఎత్తుతో వరద ప్రవాహం కొనసాగి భవనాల గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు ఎన్నడూ లేని విధంగా అలుగులు దూకి పరిసర గ్రామాలను భయభ్రాంతులకు గురిచేసింది.


ఎగువ మెదక్ జిల్లాలోని అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కూడా పంట పొలాలను ముంచి నష్టాన్ని మరింత పెంచింది. జిల్లా వ్యాప్తంగా 36కు పైగా చెరువులు తెగిపోగా.. మరో 50 వరకు చెరువులు ప్రమాద స్థితిలో ఉన్నాయని ఇరిగేషన్ శాఖ వెల్లడించింది. మంజీరా నది ఉగ్రరూపం దాల్చి.. నిజాంసాగర్ గేట్లు ఎత్తి లక్షన్నర క్యూసెక్కుల నీరు వదిలేయడంతో అనేక గ్రామాలు వరద ముంపును ఎదుర్కొన్నాయి. ఇంతటి నష్టాన్ని మిగిల్చిన వర్షం ప్రస్తుతం శాంతించింది. మళ్లీ మరో రెండు రోజుల తర్వాత కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.


ఇలాంటి సంక్షోభ సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు తమ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచారు. ఆరుగురు ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున కేటాయించారు. ఈ సాయం ద్వారా వరద బాధితులకు తక్షణ సహాయం అందుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం తమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఇది వరకే.. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఈ సందర్భంలో ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు అందజేశారు. ఈ సాయం వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలకు తోడ్పడనుంది.


కామారెడ్డి జిల్లా వరద ముప్పుతో అతలాకుతలమైంది గానీ.. ప్రజలకు అండగా నిలిచిన సహాయక చర్యలు కొంత ఊరటను కలిగిస్తున్నాయి. బీజేపీ ఎంపీలు, ఇతరులు చేసిన ఆర్థిక సహాయం తక్షణ ఉపశమనానికి దోహదం చేస్తోంది. అయితే మౌలిక సదుపాయాల బలోపేతం, చెరువుల మరమ్మతులు, ముందస్తు చర్యలు తీసుకోవడమే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించగలవు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa