ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 07:26 PM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌కు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన అవకాశం దక్కబోతోంది. ఆయన్ను గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) నామినేట్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో, త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో అజారుద్దీన్‌కు చోటు కల్పించడం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని కొద్ది వారాల క్రితం అజారుద్దీన్ ప్రకటించిన నేపథ్యంలో, తాజా కేబినెట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, పార్టీ నాయకత్వం ఆయన్ను ఒప్పించి ఎమ్మెల్సీ పదవికి అంగీకరింపజేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయంపై అజారుద్దీన్ కూడా స్పందించారు. "గవర్నర్ కోటాలో నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని కేబినెట్ నిర్ణయించడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రానికి చిత్తశుద్ధితో సేవ చేసేందుకు నేను కట్టుబడి ఉన్నాను" అని ఆయన 'ఎక్స్' వేదికగా కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో మద్దతు పలికిన తమను కాంగ్రెస్ విస్మరించిందని పలు ముస్లిం సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఈ లోటును భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముగ్గురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టగా, ఎవరూ గెలవలేదు. అజారుద్దీన్ సైతం జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ వెనుక పెద్ద న్యాయపోరాటమే నడిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా, అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ కోదండరాం, 'సియాసత్' పత్రిక సంపాదకుడు అమీర్ అలీ ఖాన్‌లను నామినేట్ చేసింది. అయితే, వీరి నియామకాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 13న అమెర్ అలీ ఖాన్ నియామకంపై స్టే విధించింది. ఈ అనూహ్య పరిణామంతో ఖాళీ అయిన స్థానంలో ఇప్పుడు అజారుద్దీన్‌ను నామినేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోదండరాం నామినేషన్‌ను యథాతథంగా కొనసాగించింది.కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అజారుద్దీన్ 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో రాజస్థాన్‌లో పోటీ చేసి ఓడిపోయారు. 2018 నుంచి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి గరిష్ఠంగా 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకదానిని అజారుద్దీన్‌తో భర్తీ చేయనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa