తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ శరవేగంగా జరిగింది. చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు ఉన్నారు. వారందరికీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు. ఒకొక్కరికీ నెలకు 6 కిలోల చొప్పున రేషన్ పంపిణీ చేస్తారు. అయితే జూన్ నెలలోనే మూడు నెలలకు సంబంధించి రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వం.. మళ్లీ సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ జరగనుంది. అయితే ఈ కేవైసీ చేయించని వారు చాలా మంది ఉన్నారని.. వారందరికీ రేషన్ ఇవ్వడం కుదరదని అధికారులు పేర్కొన్నారు.
దీనికి సంబంధించి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనివాస్ రెడ్డి తాజా ప్రకటనలో.. జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేయాల్సిందిగా సూచించారు. వేలిముద్ర (బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్) సహాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ఈ కేవైసీ చేయించుకోని వారికి రేషన్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం జిల్లాలో 5,37,810 రేషన్ కార్డులు ఉండగా.. వాటికి అనుబంధంగా 18,65,353 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. గతంలో చేపట్టిన ఈ-కేవైసీ డ్రైవ్లో 13,19,111 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని.. మిగిలిన లబ్ధిదారులు తప్పనిసరిగా సెప్టెంబర్ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు ఈ-కేవైసీ నుంచి మినహాయింపు కల్పించబడిందని అధికారులు వివరించారు. లబ్ధిదారులు దూరప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా.. స్థానిక రేషన్ దుకాణాల్లోనే బయోమెట్రిక్ ధృవీకరణతో ఈ-కేవైసీ నమోదు చేసుకునేలా సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ-కేవైసీ ద్వారా రేషన్ కార్డుల్లో నకిలీ లబ్ధిదారులను తొలగించడం.. అసలైన అర్హులకు న్యాయం చేయడం, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. వేలిముద్ర ఆధారంగా రికార్డులు డిజిటల్ రూపంలో భద్రపరచబడడం వలన.. భవిష్యత్తులో సబ్సిడీ పంపిణీ, ఇతర పథకాల ప్రయోజనాలు కూడా సులభంగా అందుబాటులోకి వస్తాయి.
ఈ-కేవైసీ నమోదు చేయని రేషన్ కార్డులు తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉందని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అర్హులైన ప్రతి కుటుంబం తమ సమీప రేషన్ షాప్లో బయోమెట్రిక్ ఆధారంగా వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వెంటనే వారికి రేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa