ట్రెండింగ్
Epaper    English    தமிழ்

660 పేజీల నివేదికపై చర్చించేందుకు కేవలం అరగంట సమయం ఇచ్చారన్న హరీశ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 09:50 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదిక రాజకీయ ప్రేరేపితమని, అదో డొల్ల రిపోర్ట్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నివేదిక న్యాయస్థానంలో నిలబడదని ఆయన స్పష్టం చేశారు.ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 660 పేజీల నివేదికపై చర్చించేందుకు కేవలం అరగంట సమయం ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఇంత పెద్ద నివేదికపై అరగంటలో ఏం మాట్లాడగలం ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుట్ర ఇది" అని ఆయన అన్నారు. ఇంత కీలకమైన అంశంపై మాట్లాడేందుకు కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలని, ఎలాంటి అంతరాయం కలిగించవద్దని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే రాబోయే రెండు రోజులు కూడా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్‌ విచారణ నిష్పాక్షికంగా సాగలేదని హరీశ్‌రావు ఆరోపించారు. విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్‌ 8బి, 8సి ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కమిషన్ ఆ నిబంధన పాటించలేదని గుర్తుచేశారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ, ఈ నివేదిక చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు.ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని, తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకుని ఇప్పటికే ఈ నివేదికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. ఆరోపణలు చేసి, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక చట్టబద్ధం కాదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విచారణ కమిషన్ల చట్టం, 1952లోని సెక్షన్ 8బీ ప్రకారం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ వాదన వినే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా నివేదిక రూపొందించారని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ నివేదిక చెత్త కాగితంతో సమానమని ఆయన అభివర్ణించారు.విచారణ కమిషన్ తన నివేదికలో ఎవరిపైనైనా ఆరోపణలు చేయాలనుకుంటే, ముందుగా వారికి సెక్షన్ 8బీ కింద నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకోవడంతో పాటు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం కల్పించాలన్నది చట్టంలోని కీలక నిబంధన అని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ, జస్టిస్ ఘోష్ కమిటీ ఈ ప్రాథమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గానీ, తనకు గానీ, విచారణకు పిలిచిన ఇతర నేతలు, అధికారులకు గానీ ఈ నోటీసులు ఇవ్వలేదని, అందువల్ల ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి భూసేకరణను అడ్డుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారని, ఇప్పుడు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసి రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విచారణ కమిషన్లను రాజకీయ అస్త్రంగా వాడుకోవద్దని 1958లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa