ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతా హరీష్‌రావు వల్లనే .. కడుపు రగిలిపోతోంది: ఎమ్మెల్సీ కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 06:38 PM

తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నా తండ్రి కేసీఆర్‌కి తిండి, డబ్బు మీద ఎప్పుడూ ఆశ ఉండదు. తరతరాల సంపాదనను తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. అలాంటి మహానాయకుడిపై అవినీతి ముద్ర వేయడానికి సీబీఐ ఎంక్వైరీ పెట్టడం చూసి నా గుండె మండిపోతోంది” అని అన్నారు. “కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్‌కి మరక పడేలా చేసిన వారిలో మాజీ మంత్రి హరీష్‌రావు, సంతోష్ రావు కీలక పాత్ర పోషించారు. అందుకే హరీశ్ రావును రెండో సారి ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. వీరిద్దరు కలిసి నా మీద కూడ కుట్ర పన్నారు.. వీరి వెనక సీఎం రేవంత్ రెడ్డి నిలబడి ఉన్నారు.. పార్టీ అంతర్గతంగా కొందరు కావాలనే కుట్రలు పన్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం కంటే కేసీఆర్ ఆస్తిపరుడు కావాలని అనుకున్నారని అంటున్నారు.. నిజంగానే నిజాం స్పూర్తిగానే సాగుతామన్నారు.


నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. అయినా సరే, నా తండ్రి గౌరవం కాపాడటానికి తప్పకుండా నిజం చెబుతాను. బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ పరిణామాలే నిర్ణయిస్తాయి. ఒకవేళ కేసీఆర్‌పై విచారణ కొనసాగితే పార్టీ నిలబడగలదా అన్న ప్రశ్నను ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. ఇన్ని రోజులుగా పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఓర్పు ప్రదర్శించానని.. హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు బయటకు తీయకుండా ఆగానని తెలిపారు. అయితే ఇప్పుడు మౌనం వహిస్తే ప్రజలు కేసీఆర్‌నే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని.. అందుకే నిజాన్ని బహిర్గతం చేయాల్సి వచ్చిందని అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే.. హరీష్ రావు, సంతోష్ రావులపై తక్షణమే విచారణ జరపాలన్నారు. కేసీఆర్ చేసిన పనుల్లో ఎలాంటి తప్పులు లేవని, ఏ విచారణ జరిగినా ఆయన నిష్కళంకుడిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రతిపక్షాల విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగతంగా దూషించడం అనేది ప్రజాస్వామ్యానికి హానికరమని కవిత వ్యాఖ్యానించారు.


రాజకీయ నాయకులు ప్రజల సమస్యలపై చర్చించాలని, వ్యక్తిగత స్థాయిలో పరస్పర దాడులు చేయడం కంటే అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజలు కూడా ఇప్పుడు నిజాయితీగా పనిచేసే నాయకులను గుర్తించగలరని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు తాను చేసిన ఈ వ్యాఖ్యలకు చిల్లర కామెంట్స్ చేస్తే ఊరుకోను అని.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa