మన సమాజంలో అత్యంత బాధ కలిగించే నిజం ఏమిటంటే.. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో చిన్నారులు ఉండటం. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ధనిక కుటుంబాలు పెద్ద ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స పొందగలుగుతాయి. కానీ పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల చికిత్స చేయించలేక.. ఆర్థికంగా తోడ్పాటు అందించాలని చాలా మందిని వేడుకుంటూ ఉంటారు. ఇటువంటి వారికి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.
పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు నిమ్స్లో ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతోందన్నారు. బ్రిటన్ వైద్యుల సహకారంతో ఈ శిబిరంలో పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ముందుగా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమైన వారికి తక్షణం ఆపరేషన్లు చేయబడతాయి. ముఖ్యంగా ఈ చికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ , సీఎంఆర్ఎఫ్ ద్వారా భరిస్తోంది. అంటే తల్లిదండ్రులకు ఒక్క రూపాయి భారమూ పడదు.
నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప వెల్లడించిన ప్రకారం.. ఆసుపత్రి పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో డా. అమరేష్ రావు, డా. ప్రవీణ్, డా. గోపాల్ లాంటి నిపుణ వైద్యులు మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులను పరీక్షించనున్నారు. పిల్లల తల్లిదండ్రులు అంతక ముందు తీసుకున్న రిపోర్టులు, సీటీస్కాన్ డాక్యుమెంట్లు వెంట తీసుకురావాలని సూచించారు.
ఈ శిబిరం పేదల కోసం ఎంతగానో ఉపయోగపడనుంది. ఒక బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి తల్లిదండ్రులు చేసే కృషి అపారమైనది. కానీ ఆర్థిక సమస్యలు ఎదురవుతుంటే ఆ తల్లిదండ్రుల వేదన మాటల్లో చెప్పలేనిది. నిమ్స్ ఈ చర్యతో వందలాది కుటుంబాలకు కొత్త ఆశను అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa