ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదవాల్సిందే..స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 06:45 PM

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రిజర్వేషన్ విధానం అమల్లో ఉంది. ఇది స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య సమాన అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ముఖ్యంగా వైద్య విద్య చదవాలనుకునే వారికి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చదివిన వారు మాత్రమే స్థానికులుగా పరిగణించబడతారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం నాలుగేళ్ల విద్యను రాష్ట్రంలోనే అభ్యసించాలి. ఇది వరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ బీఆర్ గవాన్ నేతృత్వంలోని ధర్మాసనం పక్కన పెడుతూ ఈ సంచలన తీర్పును వెలువరించింది.


తెలంగాణలో వైద్య విద్యలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘకాలంగా చర్చ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ తీర్పులో వెల్లడించింది. దీని వ్ ఎంసీహెచ్, ఎంఎస్, ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో స్థానిక అభ్యర్థులకే ప్రాధాన్యం లభిస్తుంది.


 కనీసం నాలుగేళ్లపాటు ఆ రాష్ట్రంలో చదివినవారే స్థానికులుగా అర్హత సాధిస్తారని కోర్టు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో చదివిన విద్యార్థులకే మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడంలో అధిక అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం కేవలం ఆల్ ఇండియా కోటా కింద లభించే 15 శాతం సీట్లకే అర్హులు అవుతారు. మిగిలిన 85 శాతం సీట్లు పూర్తిగా స్థానిక విద్యార్థులకే కేటాయించబడతాయి.


న్యాయమూర్తుల అభిప్రాయం ప్రకారం వైద్య విద్య ఒక రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుసంధానమై ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను పూరించాలంటే.. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు. ఈ తీర్పుతో తెలంగాణలో చదువుకున్న వారికి మెరుగైన అవకాశాలు లభించగా.. ఇతర రాష్ట్రాల విద్యార్థులకైతే ప్రవేశ అవకాశాలు తగ్గిపోతాయి.


ప్రస్తుతం తెలంగాణలోని విద్య, ఉద్యోగాల్లో 95 శాతం సీట్లు స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగిలిన 5 శాతం సీట్లు స్థానికేతర విద్యార్థులకు లభిస్తాయి. వీటిలో కూడా స్థానికులు పోటీపడే అవకాశం ఉంటుంది. అయితే.. ఒకటవ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు ఏదైనా జిల్లాలో చదివితేనే ‘లోకల్ క్యాండిడేట్’ హోదా వస్తుంది. ఈ నిబంధన ప్రకారం ఎంపికలు జరుగుతాయి. వైద్య విద్యలో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివిన వారు మాత్రమే స్థానికులుగా పరిగణించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa