ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్‌లో కిటెక్స్ గార్మెంట్స్ ప్రొడక్షన్ షురూ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 04:32 PM

వరంగల్‌‌‌‌ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌లో పార్క్‌‌‌‌లో ఏర్పాటు చేసిన కేరళకు చెందిన కిటెక్స్‌‌‌‌ గార్మెంట్స్‌ ‌‌‌ ఉత్పత్తిని ప్రారంభించింది. కిటెక్స్ అప్పారెల్ పార్క్స్ అనే అనుబంధ సంస్థ ఈ యూనిట్‌ను నిర్వహిస్తోంది. తెలంగాణలో రెండు పెద్ద ప్రాజెక్టులను కిటెక్స్ ప్రతిపాదించింది. వీటిల్లో ఇది ఒకటి. ఇక వరంగల్‌లో ఏర్పాటు చేసిన కిటెక్స్ యూనిట్ రోజుకు 1.1 మిలియన్ రెడీమేడ్ పిల్లల దుస్తులను ఉత్పత్తి చేయగలదు. ఈ యూనిట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను దాదాపుగా ప్రారంభించామని మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం. జాకబ్ తెలిపారు.


అలానే రానున్న రెండు మూడు నెలల్లోనే పూర్తిస్థాయిలో ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటామని జాకబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త మార్కెట్లపై దృష్టి పెట్టడానికి కిటెక్స్ నయా వ్యూహం రూపొందిస్తోంది. భారతదేశంలో రిటైల్ స్టోర్లను, ఫ్రాంచైజ్ కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త యూనిట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జాకబ్ తెలిపారు.


గత సంవత్సరం వరకు కిటెక్స్ తన ఉత్పత్తులన్నింటినీ అమెరికాకు ఎగుమతి చేసేది. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయా దేశాల మీద సుంకాల మోత మోగిస్తోన్న సంగతి తెలిసిందే. దీని వల్ల కిటెక్స్ కంపెనీ తన ఎగుమతులను ఇతర దేశాలకు విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అమెరికాకు ఎగుమతులు 92 శాతానికి పడిపోయాయని జాకబ్ తెలిపారు. కిటెక్స్ ఇప్పుడు యూరప్‌లోని వినియోగదారులను ఆకర్షిస్తోంది. యూకే, రష్యా వంటి దేశాలను కూడా కొత్త మార్కెట్లుగా పరిశీలిస్తున్నామని జాకబ్ చెప్పారు.


కిటెక్స్ 2024-25 వార్షిక నివేదిక ప్రకారం కంపెనీ.. ప్రస్తుతం రోజుకు 4,32,000 దుస్తులు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. అలానే కిటెక్స్ తెలంగాణలో రెండో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రెండో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ భూమి రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ ఎదురు చూస్తోంది. ఈ ప్లాంట్ హైదరాబాద్ సమీపంలోని సీతారాంపూర్‌లో ఉంది. 2023 సెప్టెంబర్‌లో ఇక్కడ భూమి పూజ చేశారు. 250 ఎకరాల భూమికి డబ్బులు చెల్లించినప్పటికీ ఇంకా భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. అయితే త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయిన జాకబ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


అలానే సీతారాంపూర్ ప్లాంట్ 2026, డిసెంబర్ నాటికి పూర్తవుతుందని.. ఇది రోజుకు 1.2 మిలియన్ దుస్తులు తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండబోతుందని ఆయన తెలిపారు. కిటెక్స్ తెలంగాణాలో రూ. 3,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఇదివరకే ప్రకటించింది. అయితే, వార్షిక నివేదికలో ఈ మొత్తాన్ని రూ. 3,550 కోట్లకు పెంచారు.


వరంగల్ జిల్లాలోని శాయంపేట హవేలీలో బీఆర్ఎస్ పాలన కాలంలో అనగా 2017లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.1,350 కోట్లతో 1,150 ఎకరాల్లో ఈ పార్కు పనులు ప్రారంభం అయ్యాయి. అనంతరం సుమారు 22 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోగా.. వీటిల్లో చిన్న పిల్లల దుస్తుల తయారీకి సంబంధించిన కిటెక్స్ గార్మెంట్స్ కంపెనీ కూడా ఉంది. ఇది 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 187 ఎకరాల్లో పిల్లల దుస్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa