రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక జీవో వెలువడే అవకాశం ఉందని సమాచారం.స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ)కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే శాసనసభలో బిల్లును ఆమోదింపజేసింది. అనంతరం ఆమోదం కోసం బిల్లును రాజ్భవన్కు పంపింది. అయితే, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం గవర్నర్ను కలిసి బిల్లును వెంటనే ఆమోదించాలని కోరింది. అయినప్పటికీ, రాజ్భవన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువు సమీపిస్తుండటంతో గవర్నర్ ఆమోదం కోసం వేచి చూడకుండా జీవో ద్వారా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వేలో వెల్లడైన జనాభా లెక్కల ఆధారంగా గ్రామ, మండల, జిల్లా పరిషత్ స్థాయిలలో బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ పరిణామాలతో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు త్వరలోనే తెరపడనున్నట్లు స్పష్టమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa