సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందంటూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత శ్రీలత తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తాను ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నానని, 4వ వార్డు టికెట్ తనకే వస్తుందని ఆశించానని ఆమె పేర్కొన్నారు. అయితే చివరి నిమిషంలో పార్టీ తనను పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఆమె బైఠాయించి ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా శ్రీలత స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులు వడ్డే కృష్ణ, శ్రీకాంత్ రెడ్డిలు కుమ్మక్కై టికెట్లను భారీ ధరకు అమ్ముకున్నారని ఆమె బహిరంగంగా ఆరోపించారు. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు కాకుండా, డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నశించిందని, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ నాయకుల తీరును ఎండగట్టారు.
మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయిలో మహిళా నేతలకు తీరని అన్యాయం చేస్తోందని శ్రీలత మండిపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన తీరు అత్యంత దారుణంగా మారిందని, ఇది "చెత్త పాలన" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మహిళా నాయకులను విస్మరించి, ఎన్నికల సమయంలో బీఫామ్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఈ పరిణామాలు పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసే చివరి క్షణం వరకు తనకు టికెట్ ఇస్తామని నమ్మించి, తీరా సమయం దగ్గరపడ్డాక వేరే అభ్యర్థికి బీఫామ్ అందజేయడంపై ఆమె తీవ్రంగా చలించిపోయారు. తనకు జరిగిన అన్యాయంపై అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే నిరసన కొనసాగించారు. ఈ ఘటనతో జిన్నారంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, టికెట్ల అమ్మకాల ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa