ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరకొండ కోట ప్రాముఖ్యత ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 07:56 PM

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో దేవరకొండ కోట  ఉంది. ఈ కోట మూడు కొండలతో చుట్టబడిన ఒక కొండపై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్దంలో రేచెర్ల వెలమ రాజులు నిర్మించారు. శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడంకోసం ఈ కోటను నిర్మించారని చెబుతారు.కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పనిచేసిన వెలమనాయకులు కాకతీయ సామ్రాజ్య పతనానంతరం రాచకొండ, దేవరకొండలలో స్వంత రాజ్యాన్ని స్థాపించుకున్నారు. వీరిలో రెండవ మాదానాయుడు కాలంలో ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించబడ్డదని దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాధారాలనుబట్టి తెలుస్తున్నది. ఇతనికాలంలో దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది. వెలమనాయక రాజులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు 195 సంవత్సరాలపాటు పాలించారు. నల్గొండ రాజ్యాన్ని 156 సంవత్సరాల పాటు, దేవరకొండ రాజ్యాన్ని 150 సంవత్సరాల పాటు వారు పాలించారు. దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకొని పాలించినవారిలో పద్మనాయక రాజులు ముఖ్యులు. పద్మనాయక రాజులలో 6వ తరం వాడైన ఎర్రదాచమనేని మాదనాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్టు చారిత్రక కథనం. ఈ తరం తరువాతి వారైన సింగమ నాయకుడు, అనపోత నాయకుడు, వేదగిరి నాయకుడులతో పాటు 3వ మాద నాయకుడు కూడా కోట నిర్మాణంలో పాలు పంచుకున్నారు.


దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు కనువిందు చేస్తుంది. దాదాపు 500 మీటర్ల పై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట ఏడు కొండల ప్రాంతాల నడుమ సుమారు 520 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది. దాదాపు 290 సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే వుండి అనేక విధాలుగా తీర్చిదిద్దబడింది. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంటభూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు ఉన్నాయి.ఈ కోటలో ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు ఉన్నాయి. పూర్తి గ్రానైట్‌ రాయితో చెక్కబడిన 9 ద్వారాలపై అనేక కాకతీయుల రాజ చిహ్నాలు మనకు నేటికీ దర్శనమిస్తాయి. 9 ప్రధాన ప్రాకారాలు మాత్రమే కాకుండా కోట లోపలి వైపు వెళుతున్నకొద్దీ దాదాపు 30 చిన్న ప్రాకారాలు సహితం మనకు దర్శనమిస్తాయి. కోటలోకి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి వారిని బంధించడానికి వారి ఎత్తులను చిత్తు చేయడానికి, ఎక్కడికక్కడ శతృవుల రాకను నిరోధించడానికి ఆ ద్వారాలు నిర్మించారు.


అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్లబావులు కోటలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా కోటలోని ప్రజల నీటి అవసరాల కోసం ఆరు చెక్ డ్యాం వంటి నిర్మాణాలు, 5 చెరువులు ఈ కోటలో కనిపిస్తాయి. ఇన్ని నీటి వనరులు ఈ కోటలో అలనాటి రాజులు కల్పించడం విశేషం.కోటకు 360 బురుజులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలున్నట్లు ఆధారాలున్నాయి.ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తుశాఖ వారి ఆధీనంలో ఉంది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రిక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అత్యంత విలువైన కళాఖండాలు కూడా శిథిలమౌతున్నాయి. దుండగులు గుప్తనిధుల కొరకు జరిపిన త్రవ్వకాలలో అనేక విలువైన కళాఖండాలు ధ్వంసం చేయబడ్డాయి.


హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వెళ్ళే రహదారిలో మల్లెపల్లి గ్రామం ఉంది. అక్కడినుండి 7 కిలోమీటర్ల దూరంలోనే దేవరకొండ దుర్గం ఉంది.దేవరకొండలో పాతవి శివాలయం, రామాలయం ఉన్నాయి. కొత్తగా కన్యకాపరమేశ్వరి, సంతోషిమాత, మార్కండేయ, సాయిబాబా, అయ్యప్ప గుడులు నిర్మించారు. ఇంకొకటి పెద్దదర్గా: ఈ దర్గా ఉర్సు డిండి మండలం ఎర్రారం గ్రామం నుంచి గంధాన్ని తీసుకువచ్చి ఊరేగింపు నిర్వహిస్తారు.అలీ సయ్యద్ దేవరకొండ రచయిత. అతని రచనలలో ముఖ్యమైనవి. జలంధరాసుర వధ, ప్రమీల, దిగంబరమోహిని, నవీన సత్యహరిశ్చంద్ర, నల చక్రవర్తి, భీమ పరమ మహాత్యము, బబ్రువాహన, ధ్రువ, నగర, ఆనందగురు గీత, ముక్తి ప్రదాయిని, సత్యాద్రౌపది సంవాదము, కాళింది, సిరిసినగండ్ల నలనాటకము, సీతారామ శతకము, సురభాండేశ్వరము, మానసిక రాజయోగము






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa