గతేడాది వానలు దంచికొట్టాయి... ఎండలు మండిపోయాయి.. ప్రకృతి వైపరీత్యాలూ విరుచుకుపడ్డాయి. వెరసి... దేశంలో 2024లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు దేశవ్యాప్తంగా 3,204 మంది చనిపోయారు. పిడుగులు పడి బిహార్లో, వరదలకు కేరళలో భారీగా మృత్యువాత పడ్డారు. పలు రాష్ట్రాల్లో అసాధారణ ఎండలు కాసి, జాతీయ వార్షిక సగటు కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రుతుపవనాల సీజన్లలో పలుచోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 2024 సంవత్సరం... శీతాకాలం (జనవరి నుంచి ఫిబ్రవరి), రుతుపవన ముందస్తుకాలం (మార్చి నుంచి మే), నైరుతి రుతుపవన కాలం (జూన్ నుంచి సెప్టెంబరు), ఈశాన్య రుతుపవన కాలం (అక్టోబరు నుంచి డిసెంబరు) సీజన్లలో సంభవించిన అసాధారణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ఏటేటా అసాధారణంగా ప్రకృతి విపత్తులు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. 2024లో ప్రకృతి విపత్తుల ప్రభావానికి దేశంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు 1,374 మంది, వరదలు, భారీవర్షాలకు 1,287, వడగాడ్పులకు 459, తుఫాన్లకు 70 మంది, శీతలగాలులు, పెనుగాలులకు ఏడుగురు, వడగళ్లకు ఇద్దరు, మంచు ప్రభావానికి ఒకరు చనిపోయారు. పిడుగుల కారణంగా బిహార్లో, వరదల వల్ల కేరళలో ఎక్కువమంది మృత్యువాత పడగా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో సుమారు 50 మంది, తెలంగాణలో 150 మంది చనిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa