జమ్ము కశ్మీర్లో తాజాగా ఉగ్రవాదులు ఓ మాజీ సైనికుడి ఇంటిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ సహా ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారంలో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. మాజీ సైనికుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే తీవ్ర గాయాలపాలైన ఆయన భార్య, కుమార్తె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ వాగే నివాసం ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే పని చేసిన అతడు.. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా భార్య, కుమార్తెతో కలిసి అదే ప్రాంతంలో జీవిస్తున్నాడు. అయితే సోమవారం రోజు మధ్యాహ్నం కొందరు ఉగ్రవాదులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. మంజూర్ అహ్మద్ వాగే.. లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో మాజీ సైనికుడితో పాటు ఆయన భార్య, కుమార్తెలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అయితే కాల్పుల చప్పుడుతో విషయం గుర్తించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన మాజీ జవాన్ మంజూర్ అహ్మద్ వాగేను, ఆయన భార్య, కుమార్తెలను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని నేరుగా ఆర్మీ అధికారులే వెల్లడించారు. కాళ్లకు బుల్లెట్ గాయాలు అయిన ఆయన భార్య, కుమార్తె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. అయితే వారికి మాత్రం ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు.
ఉగ్రదాడుల్లో మాజీ జవాన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న పోలీసులు, పారామిలిటరీ దళాలు, ఆర్మీతో కూడిన సంయుక్త బృందం వెంటనే ఆయన నివాసం ఉంటున్న ఏరియాని చుట్టుముట్టాయి. దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇదంతా ఇలా ఉండగా.. గత నెలలో కూడా జమ్ము కశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆర్మీ సైనికులు ఎదురు కాల్పులు చేయగా.. అందులో ఓ సైనికుడు మృతి చెందాడు.