ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ బృందంతోపాటు దావోస్ వెళ్లిన నారా బ్రాహ్మణి.. ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 08:21 PM

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడంతో పాటుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారుల టీమ్.. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు, అధినేతలు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటూ మంత్రులు, అధికారుల టీమ్ దావోస్‌లో జరిగిన సదస్సుకు హాజరైంది. వీరితో పాటు కేందమ్రంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు దావోస్ వెళ్లారు.


అయితే అజయ్ బోస్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి దావోస్ వెళ్లినవారి వివరాల కోసం దరఖాస్తు చేయగా.. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ నుంచి వెళ్లిన టీమ్‌లో మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పేరు కూడా కనిపించింది.


దావోస్ పర్యటనలో ఒక్క ఎంఓయూలు కూడా కుదుర్చుకోలేకపోయారని.. ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎద్దేవా చేస్తోంది. దావోస్ వెళ్లిన ఏపీ బృందం జాబితాలో బ్రాహ్మణి పేరు కూడా ఉందని ఆర్టీఐ ద్వారా వెల్లడి కావడంతో.. మరోసారి ప్రతిపక్ష సానుభూతిపరులు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ నుంచి దావోస్ వెళ్లిన టీమ్‌లో మొత్తం పదిమంది ఉన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎంవో అడిషనల్ సెక్రటరీ కార్తీకేయ మిశ్రా, ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ కపడ్తి రవి, ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావు, మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ భద్రయ్య, చైతన్య వినాయక సాయి, ఎస్ చైతన్య కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో సహా 18 మంది వెళ్లారు.


ఏపీ టీమ్ దావోస్ పర్యటన సాగిందిలా..


ఈ నాలుగు రోజుల పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు టీమ్ కార్పొరేట్ దిగ్గజాలకు వివరించింది. ప్రపంచం దేశాల నుంచి దావోస్‌కు వచ్చిన వివిధ రంగాలకు చెందిన వారితో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించి.. రాష్ట్రానికి వచ్చి ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆహ్వానం పలికారు. పలు కంపెనీలు అధినేత, ప్రతినిధులు రాష్ట్రానికి వస్తామని హామీ ఇచ్చారు.


దావోస్‌ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తొలి రోజు పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృధుల్ కుమార్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అలాగే స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో వరుసగా సమావేశం అయ్యారు. జ్యూరిచ్‌లో యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతోనూ చంద్రబాబు సమావేశమమై ముచ్చటించారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై చర్చించారు.


దావోస్ పర్యటనలో రెండు రోజు కూడా పలు కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో సమావేశం అయ్యారు. డెన్మార్క్‌కు చెందిన మార్స్కే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది.. డేటా సెంటర్లు, నెట్వర్క్ విడి భాగాల తయారీకి సిస్కోను చంద్రబాబు రాష్ట్రానికి ఆహ్వానించారు. అలాగే సౌత్ కొరియాలో ప్రముఖ కెమికల్ కంపెనీ ఎల్జీ కెమ్తోనూ కూడా చర్చించారు. కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ సమావేశం జరిగింది.


దావోస్ పర్యటన మూడో రోజు కూడా ముఖ్యమంత్రి టీమ్ బిజీ, బిజీగా గడిపింది. గూగుల్ క్లౌడ్ సీఈఓ కురియన్, మలేషియాకు చెందిన పెట్రోనాస్ సీఈవో, పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ ఛైర్మన్ స్టీఫెన్ కెహోతో సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని.. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని, సూచనలు చేయాలని కోరారు. మరికొందరితో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. దావోస్ పర్యటన చివరిగా ఇండియన్ పెవిలియన్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నా సరే.. టీమ్ ఇండియాగా కలిసి పనిచేస్తామన్నారు. దావోస్‌లో చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com