ఏపీ, ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉందని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అవినీతిలో కూరుకుపోవడం వల్లే వైసీపీ, ఆప్ దారుణ ఓటమిని చవిచూశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఆప్, వైసీపీలు రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెట్టేసి, అభివృద్ధికా తావు లేకుండా చేశాయన్నారు. 26ఏళ్ల తర్వాత బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కడం వెనుక కార్యకర్తల కృషి చాలా ఉందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గడచిన 8నెలల్లో ఏపీకి రూ3లక్షల కోట్లు వచ్చాయని అమిత్ షా చెప్పారని, విశాఖ స్టీల్ప్లాంటు, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
కేకే లైన్ అంశాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ జగన్ 30 ఏళ్లు తానే సీఎం అనుకుంటూ కలల్లో విహరిస్తున్నారని, రుషికొండ ప్యాలెస్ కట్టి రూ.450 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం పురందేశ్వరి సమక్షంలో మత్స్యకార నాయకుడు వాసుపల్లి సంతోష్ కుమార్, ఏపీ మెకనైజ్డ్ బోటు యజమానుల సంఘ కార్యదర్శిరాజేష్తో పాటు పలువురు బీజేపీలో చేరారు.