ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. అటు ఉభయగోదావరి జిల్లాలతో పాటు.. ఇటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది.బర్డ్ఫ్లూ.. ఇది 1990 సంవత్సరం చివర్లో చైనాలో పుట్టింది. ఈ వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 957 మందికి సోకగా, 464 మంది మరణించారు. అయితే, చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం మనుషులకు ప్రమాదం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ బర్డ్ఫ్లూ హడలెత్తిస్తోంది.ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 50 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లుగా తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం అనుముల్లంకలో ఓ పౌల్ట్రీఫామ్లో రెండు రోజుల వ్యవధిలోనే 11 వేల కోళ్లు చనిపోయాయట.. అయితే బర్డ్ప్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వైరస్ బారినపడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు రూ.లక్షల్లో నష్టపోయామంటూ లబోదిబో మంటున్నారు.
ఇదిలా ఉంటే, బర్డ్ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్పోస్ట్లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.