ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ విద్యార్థులకు ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు, రూ.2 వేల కోట్ల నిధులు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:07 PM

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శుక్రవారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే వివిధ కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, అనాథ పిల్లలకు నెలకు ఆర్థిక సాయం, చెన్నై సమీపంలో కొత్త నగర నిర్మాణం, రామేశ్వరంలో ఎయిర్‌పోర్టు, ఇళ్ల నిర్మాణ పథకం, స్కూలు పిల్లలకు అల్పాహార పథకం విస్తరణ సహా అనేక పథకాలను అమలు చేయనున్నట్లు బడ్జెట్‌లో ఎంకే స్టాలిన్ సర్కార్ కీలక ప్రకటనలు చేసింది.


తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్లస్‌ టూ(ఇంటర్‌) చదివే విద్యార్థులకు ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్‌లు అందించనున్నట్లు ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు ఈ ప్రకటన చేశారు. ఈ పథకం కోసం తాజాగా పెట్టిన బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 20 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు ఈ ల్యాప్‌టాప్‌లను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. వారికి ప్రతి నెలా రూ.2 వేలు ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. విద్యకు పిల్లలు దూరం కావద్దు అనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


మరోవైపు.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. బడ్జెట్‌లో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను వెలువరించింది. రాజధాని చెన్నై సమీపంలో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. 2 వేల ఎకరాల్లో కొత్త నగరం రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఇక తమిళనాడులోని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరమైన రామేశ్వరంలో కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో "కలైంజర్‌ కనవు ఇల్లమ్‌ పథకం" కింద రూ.3500 కోట్లతో గృహాల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు.


మరోవైపు.. తమిళ తిరుక్కురళ్‌ను 45 భాషల్లోకి అనువదించనున్నట్టు మంత్రి తెన్నరసు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోమని చెప్పిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకుంటుందని.. అదే సమయంలో తమిళనాడులో కచ్చితంగా ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ఇప్పటివరకు చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో అమలు చేస్తుండగా.. ఇక నుంచి తమిళనాడు వ్యాప్తంగా విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ వరకు చదివి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ప్రతినెలా రూ. వెయ్యి చెల్లించే పుదుమైపెణ్‌ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఆర్థికసాయం అందించే తమిళ్‌ పుదల్వన్‌ పథకాలను హిజ్రాలకు కూడా అమలు చేయనున్నట్లు మంత్రి తెన్నరసు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com