ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా 65 కోట్ల మంది అక్కడకు వెళ్లి పుణ్య స్నానాలు చేయగా.. వేలాది మంది అక్కడ చిరు వ్యాపారాలు చేసుకుని లక్షలు, కోట్లు సంపాదించుకున్నారు.
ముఖ్యంగా అక్కడి పవిత్ర గంగానదిలో పడవలు నడిపిన ఓ కుటుంబం అయితే ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ విషయాన్ని నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్యే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఇదంతా బాగానే ఉండగా.. ఆ కుటుంబానికి అధికారులు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా 12.8 కోట్ల రూపాయలు కట్టాలంటూ నోటీసులు పంపారు. ఆ పూర్తి వివారలు మీకోసం.
కుంభమేళా వల్ల ఎంతోమంది ఆర్థికంగా లబ్ది పొందారని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య నాథ్యే వెల్లడించగా.. ఓ కుటుంబం 130 పడవలు నడుపుతూ 45 రోజుల్లోనే ఏకంగా 30 కోట్ల రూపాయలు ఆర్జించిందని వివరించారు. ముఖ్యంగా బోట్మాన్ పింటూ మహ్రా కుటుంబం.. త్రివేణీ సంగమం వద్ద మొత్తంగా 130 బోట్లు నడిపింది. అరైల్ గ్రామానికి చెందిన ఈ ఫ్యామిలీ ఒక్కో పడవ ద్వారా రోజుకు 50 వేల రూపాయల నుంచి 52 వేల రూపాయల వరకు సంపాదించింది.
ఇలా 45 రోజుల్లోనే ఒక్క పడవతో రూ.23 లక్షల ఆర్జించిన పింటూ కుటుంబం.. అన్ని పడవల ద్వారా మొత్తంగా రూ.30 కోట్లు సంపాదించింది. సీఎం యోగి ఆదిత్య నాథ్ వీరి కుటుంబం గురించి వెల్లడించగా.. ఈ విషయం గుర్తించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఇన్మ్ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం రూ.12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు.
ఆదాయ పన్ను శాఖ 1961 ఐటీ చట్టంలోని సెక్షన్ 4, 68 కింద నోటీసు ఇచ్చిందని.. రూ.12.8 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని పేర్కొందని పింటూ కుటుంబం వెల్లడించింది. ఒకప్పుడు నెలకు 15 వేలు కూడా సంపాదించుకోలేని తాము... కుంభమేళా జరిగిన 45 రోజుల పాటు రాత్రి, పగలు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నామని.. ఇక హాయిగా ఉండొచ్చు అనుకునేలోపే ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టమంటూ నోటీసలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ట్యాక్స్ శ్లాబ్ల గురించి కూడా తెలియని తమకు.. భారీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు.
![]() |
![]() |