అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అమెరికాకు తొలి ప్రాధాన్యం విధానాన్ని కేవలం యూఎస్ మాత్రమే ఎదగడానికి కాదని.. ఈ విషయంలో తమను అపార్థం చేసుకోవద్దని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న 10వ రైసీనా డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ కామెంట్లు చేశారు. ముఖ్యంగా భారత ప్రధాని మోదీ, ట్రంప్ ఆ విషయంలో సేమ్ టు సేమ్ ఆలోచిస్తారని చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ శాంతిని ఆకాంక్షిస్తూ.. ఐక్యత సాధించాలనే తాపత్రయం కల్గిన వ్యక్తి అని తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యానించారు. అచ్చం ఆయనలాగే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా శాంతి పునరుద్ధరణ కోసం కట్టుబుడి ఉన్నారని వివరించారు. ఈ విషయంలో ఇద్దరు నేతలు సేమ్ టు సేమ్ అనిపిస్తారని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటన చేపట్టడం వారి మధ్య ఉన్న స్నేహ బంధంతో పాటు వారి ప్రాధాన్యాలను చాటి చెబుతుందని వెల్లడించారు.
ఆ విషయంలో ట్రంప్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు..!
ఇరు దేశాల ప్రయోజనాల కోసం.. మోదీ, ట్రంప్లు ఉత్తమ సేవలు అందించాలని కృత నిశ్చయంతో ఉన్నారని తులసీ గర్బార్డ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అమెరికా ఫస్ట్ నినాదాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ట్రంప్ విధానాలను కొందరు తప్పుగా ఊహించుకుంటున్నారని అన్నారు. ఆయన ఇతర దేశాలతో ఘర్షణలు పెంచుకోవాలని భావిస్తున్నట్లు కూడా కొందరు అభిప్రాయ పడుతున్నారని చెప్పారు. కానీ ట్రంప్ అలాంటి వ్యక్తి కారని.. సమస్యను శాంతి యుతంగా పరిష్కరించుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని తులసీ గబ్బార్డ్ వెల్లడించారు
ఇదంతా ఇలా ఉండగా.. ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చిండానికి మూడు రోజుల పాటు నిర్వహించే 10 రైసీనా డైలాగ్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అనేక దేశాలకు చెందిన నేతలు వచ్చారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సాన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహాతో పాటు 125 దేశాలకు చెందిన 3500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![]() |
![]() |