అతడో సైకాలజిస్ట్. భార్యా పిల్లలతో హాయిగా జీవిస్తున్న అతడు ఓ కుక్కను కూడా పెంచుకుంటున్నాడు. సొంత బిడ్డలాగే సాకుతుండగా.. అనుకోకుండా ఆదివారం రోజు వారి ఇంటికి ఓ చిరుత పులి వచ్చింది. ఈక్రమంలోనే బయట ఉన్న కుక్కపై దాడి చేయబోయింది. దీంతో శునకం మొరగడం ప్రారంభించగా.. వెంటనే ఓనర్ సైకాలజిస్ట్ అక్కడకు చేరుకున్నాడు. పులిని చూసి భయంతో పరుగులు పెట్టకుండా.. తన పెంపుడు కుక్కను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. దాదాపు 15 నిమిషాల పాటు పులితో పోరాటం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథ చదివేయాల్సిందే.
మహారాష్ట్ర రత్నగిరి చిప్లున్ ప్రాంతంలో.. 55 ఏళ్ల ఆశిష్ మహాజన్ నివాసం ఉంటున్నాడు. అయితే అతడు సైకాలజిస్ట్ కాగా గతంలో పూణేలో ఉంటూ అక్కడే పని చేసేవాడు. కానీ ప్రశాంతమైన జీవితం గడపాలనే కోరికతో.. చిప్లున్ ప్రాంతానికి మకాం మార్చాడు. భార్యా పిల్లలతో పాటు ఇక్కడే కలిసి ఉంటూ హాయిగా జీవిస్తున్నాడు. అయితే మొదటి నుంచి కుక్కలు అంటే ఇష్టం ఉండగా.. ఓ శునకాన్ని కూడా పెంచుకుంటున్నాడు ఆశిష్ మహాజన్. కుక్కను కూడా సొంత బిడ్డలాగే చూసుకుంటూ.. ప్రేమను పంచుతున్నాడు.
ఇదంతా బాగానే ఉండగా.. మార్చి 16వ తేదీ ఆదివారం రోజు అనుకోకుండా వీరి ఇంటికి ఓ చిరుత పులి వచ్చింది. ఈక్రమంలోనే బయట ఉన్న పెంపుడు శునకాన్ని చూసి దానిపై దాడి చేయబోయింది. కానీ కుక్క విపరీతంగా మెరగడంతో.. ఆశిష్ మహాజన్ బయటకు వచ్చారు. టార్చి లైట్ వేసి మరీ ఏం జరుగుతుందో చూశారు. ముఖ్యంగా అక్కడ ఓ చిరుత పులి ఉండడం గమనించారు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో పరుగులు పెట్టకుండా.. తన పెంపుడు శునకాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు.
ఈక్రమంలోనే తలుపులు తీసి బయటకు వచ్చి మరీ పులిపై దూకారు. పులి కూడా ఆశిష్ మహాజన్పై దాడి చేసింది. అయితే చప్పుడు ఎక్కువ కావడంతో.. ఆశిష్ మహాజన్ భార్య సుప్రియ అక్కడకు వచ్చారు. పులిని చూసిన వెంటనే.. ఇంట్లో ఉన్న ఓ పదునైన ఈటెను విసిరారు. అది అందుకున్న ఆశిష్ మహాజన్.. పులిపై దాంతో దాడి చేశారు. ముఖ్యంగా మెడ, ఛాతీపై గుచ్చారు. తీవ్ర గాయాలపాలైనా ఇంటి ఆవరణ ఇరుకుగా ఉండండతో చిరుత పులికి పారిపోయే అవకాశం లేకపోయింది. దీంతో ఓనర్పై దాడికి పాల్పడుతూనే వచ్చింది.
ఇలా పదే పదే దాడి చేయగా.. ఆశిష్ మహాజన్ గట్టిగా ఈనెను దాని ఒంట్లోకి దింపాడు. దీంతో చిరుత పులి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ పోరాటంలో ఆశిష్ మహాజన్కు కూడా గాయాలు కాగా.. అతడి భార్య సుప్రియ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆశిష్ పరిస్థితి నిలకడగానే ఉండగా.. గాయాలకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు పులిని చంపిన విషయం గురించి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ముఖ్యంగా చిరుత పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది రెండేళ్ల వయసు కల్గిన ఆడ చిరుత పులి అని చెప్పారు. అంతేకాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశిష్ మహాజన్ ఆస్పత్రి ఖర్చులు కూడా తామే భరిస్తామని రత్నగిరి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గిరిజా దేశాయ్ పాటిల్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలంగా చాలా జాగ్రత్తగా ఉండాలని.. అటవీ ప్రాంతానికి దగ్గర్లోనే ఈ గ్రామం ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
![]() |
![]() |