తెలంగాణ కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కూనంనేని సమర్థించడంతో ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. పర్యాటక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం పర్యాటక రంగంలో ఉందన్నారు.
తాను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఏ ఇజం లేదని తాను అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని సీపీఐ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తన మాటలు, ఆలోచలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడంత సమయం లేదని.. త్వరగా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని కలెక్టర్లకు సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని.. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలని సూచించారు. టూరిజం ద్వారా స్థానికగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని.. అప్పుడు ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా ప్రజలకు ఉపాధి కల్పించే రంగం పర్యాటకం అని వ్యాఖ్యానించారు.
కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ అసెంబ్లీలో గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 'గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు.. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది.. కానీ, నిజంగా ఖర్చులేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే' అంటూ వ్యాఖ్యానించారు. కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. తాను 30 ఏళ్ల క్రితం చెబితే ఆగ్రహం వ్యక్తం చేసినవారు.. ఇప్పటికి అర్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |