ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప భక్తుల కోసం బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 08:32 PM

అయప్ప భక్తులకు శబరిమల దేవస్థానం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా బంగారంతో తయారు చేసిన లాకెట్లను.. గర్భ గుడిలో ఉంచి పూజ చేసిన తర్వాత భక్తులకు అందిస్తోంది. ఈరోజే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా 100కు పైగా లాకెట్లు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వ్యక్తే తొలి లాకెట్‌ను పొందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా తెగ సంబుర పడిపోతున్నారు. బంగారు లాకెట్లను ఎలా పొందాలోనని తెలుసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు చాలా కాలంగా బంగారు లాకెట్లు అమ్మమంటూ ఆలయ కమిటీకి చెబుతున్నారు. ఇలా తరచుగా భక్తులు డిమాండ్ చేయగా.. ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) విన్నపాలను మన్నించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండేలా బంగారు లాకెట్లను తయారు చేయించేందుకు టెండర్ వేసింది. ఈక్రమంలోనే తమిళనాడుకు చెందిన జీఆర్టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ ఈ టెండర్లను దక్కించుకున్నాయి. వీరే అయ్యప్ప స్వామి ఫొటోతో కూడిన బంగారు లాకెట్లను తయారు చేసి టీడీబీకి అప్పగించాల్సి ఉంటుంది.


 అయితే ఈ లాకెట్లు అందరికీ అందుబాటులో ఉంచేలా 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల్లో తయారు చేయిస్తున్నారు. 2 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.19,300 అని 4 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.38,600 అని 8 గ్రాముల బరువు ఉండే బంగారు లాకెట్ ధరను 77,200 రూపాయలకు అమ్ముతున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు వెల్లడించింది. ముఖ్యంగా వీటి అమ్మకాలను విషు పర్వదిన సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ సోమవారం రోజు నుంచి అందిచబోతున్నట్లు ప్రకటించింది. అలాగే వీటిని ఎలా పొందాలో కూడా ముందుగానే వివరించింది. అయితే బంగారు లాకెట్లు కావాలనుకునే వారు కచ్చితంగా శబరిమల వెళ్లాల్సి ఉండగా.. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే నగదు చెల్లించి కూడా పొందవచ్చు.


ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకునే వాళ్లు WWW.Sabarimalaonline.org కు వెళ్లి గోల్డ్ లాకెట్లు బుక్ చేసుకుని డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత శబరిమల వెళ్లి.. వారు నగదు చెల్లింపు చేసిన దాన్ని చూపిస్తే నేరుగా లాకెట్ అందజేస్తారు. ఇలా కాకుండా నేరుగా శబరిమల వెళ్లిన వాళ్లు ఆలనయ ప్రధాన ప్రాంతమైన సన్నిధానంలోని దేవస్వోమ్ పరిపాలనా కార్యాలయంలో నగదు చెల్లించడం ద్వారా పొందవచ్చని టీడీబీ పేర్కొంది. అయితే ఈరోజే ఈ లాకెట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. రెండ్రోజుల క్రితమే బుకింగ్ ప్రారంభం అయింది. దీంతో 100కు పైగా భక్తులు లాకెట్లను బుక్ చేసుకున్నారు.


అయితే కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసనన్ ఈ బంగారు లాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడికి తొలి లాకెట్‌ను అందజేశారు. ఆ తర్వాత శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి రాజీవరు, టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఏ అంజి కుమార్ మిగిలిన భక్తులకు లాకెట్లను అందజేశారు. మీక్కూడా కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకుని శబరిమలకు వెళ్లిపోండి. ఎంతో పవిత్రమైన అయ్యప్ప లాకెట్‌ను పొందండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com