ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. ఈ సందర్భంగా ఇటీవల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంగా మే 2వ తేదీన తలపెట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని, వాటికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రోడ్మ్యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది.ప్రధానితో చంద్రబాబు భేటీలో అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పురోగతి, రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక ప్రాజెక్టులు, ఆర్థిక వనరులు, విభజన హామీలు వంటి పలు అభివృద్ధి అంశాలపై కూడా చర్చించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర సహకారం ఆశిస్తున్నట్లు సీఎం ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ సానుకూల వాతావరణంలో జరిగినట్లు సమాచారం
![]() |
![]() |