ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్కింగ్ స్థలం చూపిస్తేనే వాహనాల రిజిస్ట్రేషన్..: సర్కారు నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 07:43 PM

మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ముందు.. కొనుగోలుదారులు తమకు పార్కింగ్‌ స్థలం ఉందని నిరూపించుకుని, మున్సిపల్‌ అధికారుల నుండి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. అది చూపిస్తేనే వాహన రిజిస్ట్రేషన్ చేస్తారు. లేదంటే మీరు కొనుగోలు చేసిన వాహనం రిజిస్ట్రేషన్ ఎప్పటికీ కాదు. ఈ వార్త తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు తెగ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవలే కారు కొనుగోలు చేసి పార్కింగ్ స్థలం లేని వాళ్లంతా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నారు.


మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు.. ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. మొన్నటికి మొన్న పార్కింగ్ స్థలం ఉంటేనే కారు కొనుగోలు చేయొచ్చని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా పార్కింగ్ స్థలాన్ని చూపించాల్సిందేనని చెబుతోంది. ముఖ్యంగా కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారంతా తమ వాహనం పెట్టుకోవడానికి ఇళ్ల వద్ద పార్కింగ్ స్థలం ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా చేయలేకపోతే వాహనం రిజిస్ట్రేషన్ జరగదని.. ఒకవేళ స్థలం ఉంటే మున్సిపల్ అధికారులకు ఆ ప్రాంతాన్ని చూపించి మరీ వారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలని పేర్కొన్నారు. ఆపై దాన్ని తీసుకునే రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి.. అధికారులకు చూపిస్తే రిజస్ట్రేషన్ చేస్తారని అన్నారు.


అలాగే ఈ విధానాన్ని ముందుగా ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో మొదటగా అమలులోకి తీసుకు రాబోతున్నట్లు మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల అనధికారికంగా పలవురు వాహనాలను పార్కింగ్ చేస్తున్నన విధానానికి చెక్ పెట్టొచ్చని చెప్పారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని అన్నారు. ఒకవేళ వాహన దారులకు స్వంతంగా పార్కింగ్‌ స్థలం లేకపోతే.. సంబంధిత స్థానిక సంస్థలు పార్కింగ్‌ సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగానే మున్సిపల్‌ పార్కులు, మైదానాల క్రింద భూగర్భ పార్కింగ్‌ సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇచ్చేందుకు కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు.


ఇందులో భాగంగానే ఇప్పటికే థానే మున్సిపల్ కార్పొరేషన్ భూగర్భ పార్కింగ్‌ను నిర్మించింది. ఇది రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే పాత అక్ట్రాయ్‌ నాకాలను ఇంటిగ్రేటెడ్‌ ట్రక్‌ టెర్మినల్స్‌గా మారుస్తూ.. అక్కడ పార్కింగ్‌ బేస్‌లు మరియు విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంలో, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ కోసం పార్కింగ్‌ స్థలం సర్టిఫికేట్‌ తప్పనిసరి అవుతుంది.


ఇది ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడంలో, పార్కింగ్‌ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com