ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థాయ్‌లాండ్-కంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక హెచ్చరిక

international |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 09:39 PM

థాయ్‌లాండ్, కంబోడియా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం.. భారతీయ పౌరులందరికీ కీలక ప్రయాణ సలహాను జారీ చేసింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా ఇప్పటికే ప్రాణ నష్టం జరిగిందని చెప్పింది. ఒక సైనికుడితో పాటు మరో 15 మందికి పైగా వ్యక్తులు మరణించారని, పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా, భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతం థాయ్‌లాండ్ వెళ్లాలనుకునే వారు ఆ ఏడు ప్రాంతాలకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.


భారత రాయబార కార్యాలయం ముఖ్యంగా ఏడు థాయ్ ప్రావిన్స్‌లకు ప్రయాణించవద్దని తన పౌరులకు గట్టిగా సలహా ఇచ్చింది. ఈ ప్రాంతాలలో ఉబోన్ రాచతాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కేవో, చాంతబురి, ట్రాట్ ఉన్నాయి. ఈ ప్రావిన్స్‌లు కంబోడియా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో.. అక్కడ ఘర్షణలు తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఉద్రిక్తతలకు ఇటీవలే థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక ల్యాండ్‌మైన్ పేలుడు కారణమని తెలుస్తోంది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.


థాయ్‌లాండ్ ఈ పేలుడుకు కంబోడియాను నిందించగా.. కంబోడియా మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అది పాత ల్యాండ్‌మైన్ వల్ల జరిగి ఉండవచ్చని వాదిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సరిహద్దులో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో.. థాయ్‌లాండ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కంబోడియాలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. అంతేకాకుండా థాయ్‌లాండ్‌లోని కంబోడియా రాయబారిని బహిష్కరించింది.


ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సరిహద్దు చెక్‌పోస్ట్‌లను మూసివేసింది. కంబోడియాలో ఉన్న తమ పౌరులందరినీ వెంటనే దేశాన్ని విడిచి వెళ్లమని థాయ్‌లాండ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ ఆయుధాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించుకుంటున్నాయి. ఇది ఘర్షణలు మరింత తీవ్రమవుతాయని సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాయబార కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa