ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ పర్యటనతో ముయిజ్జులో మార్పు,,,భారత్ అత్యంత విశ్వసనీయమైన క్లోజ్ ఫ్రెండ్

international |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 08:09 PM

భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలు ఇటీవల కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ.. వాటిని పక్కన పెట్టి ఇండియాతో స్నేహం చేయాలని మాల్దీవులు తెగ ఉవ్విళ్లూరుతోంది. భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్రం దేశం అని తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ముయిజ్జు తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పర్యటనలోనే ఉండగా.. నేరుగా మోదీతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తుంటేనే ఆ దేశం ఇండియాతో చేతులు కలపాలని ఎంతగా భావిస్తుందో అర్థం అవుతుంది.


ప్రధాని మోదీ మాల్దివుల పర్యటనకు వెళ్లగా.. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ముయిజ్జుయే నేరుగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. ఆయనే దగ్గరుండి మరీ ప్రధానిని అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. ఆపై అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. 4 వేల 78 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగుతుండడం గర్వించదగ్గ విషయం అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీకి.. ప్రజా సేవపై ఉన్న నిబద్ధత, దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపై మీకున్న అంకిత భావానికి ఈ మైలురాయి నిదర్శనం అని పేర్కొన్నారు.


అక్కడితో ఆగకుండా సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందన్నారు. భద్రత, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి విస్తృత రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందన్నారు. ఎలాంటి విపత్తులు, సంక్షోభాల సమయంలో అయినా తమ ద్వీప దేశానికి భారత్ అండగా నిలుస్తూ వచ్చిందని ముయిజ్జు గుర్తు చేశారు. అత్యంత వేగంగా స్పందించి ఆపన్న హస్తాన్ని అందించిందని చెప్పారు.


ఈ సందర్భఁగానే ప్రధాని మోదీ కూడా మాట్లాడుతూ.. మాల్దీవుల రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మాల్దీవుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 565 మిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని అందించనున్నట్లు భారత్ ప్రకటించింది. ఇది మాల్దీవుల అభివృద్ధి పట్ల భారత దేశానికి ఉన్న అంకితభావాన్ని, నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రెండు దేశాల సంబంధాలను 'పొరుగు దేశాలు, భాగస్వాములు, నిజమైన మిత్రులు' అని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారతదేశం అనుసరిస్తున్న 'నేబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో, 'మాహాసాగర్' దార్శనికతలో మాల్దీవులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ఆయన స్పష్టం చేశారు.


అంతేకాకుండా.. భారత్ సహకారంతో నిర్మించిన మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనాన్ని ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళం (MNDF) కోసం 72 వాహనాలను, ఇతర పరికరాలను కూడా భారత్ అందజేసింది. ఈ చర్యలన్నీ ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచాయి. అలాగే మోదీ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఉత్సాహం నిండింది. ఇది భవిష్యత్తులో మరింత బలమైన బంధానికి నాంది పలకనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa