ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్లెవెలుగు బస్సుల్లోనూ చల్లగా.. ఏపీఎస్ఆర్టీసీ ప్లాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 09:35 PM

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఆలయాల్లో నిషేధం విధించారు. అలాగే సచివాలయంలోకి ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధం వంటి నిర్ణయాలు అమలు చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఇకపై డీజిల్ బస్సులు కాకుండా ఎలక్ట్రికల్ బస్సులనే కొనుగోలు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ఆర్టీసీ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇకపై ఎలక్ట్రికల్ బస్సులనే కొనుగోలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇటీవల వెల్లడించారు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు.


కొత్తగా 1150 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందుకోసం డిపోలలో మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. డిపోల వద్ద ఎలక్ట్రికల్ బస్సుల కోసం ఛార్జింగ్ పాయింట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వివరించారు. మరోవైపు పల్లె వెలుగు బస్సులను కూడా ఏసీ బస్సులనే ఏర్పాటు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పడం విశేషం.


రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా పొన్నూరు ఆర్టీసీ డిపోలో బస్సులు తక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆర్టీసీ ఎండీ దృష్టికి తెచ్చారు. దీంతో పలు గ్రామాలకు సర్వీసులు నిలిచిపోయాయని వివరించారు. దీంతో సరైన చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఎమ్మెల్యేకు తెలిపారు.


మరోవైపు స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రావటంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ శుక్రవారం కావటంతో అన్నవరం ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. అన్నవరం ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో పెద్దఎత్తున పాల్గొన్నారు. సుమారుగా పదివేల మంది మహిళలు పాల్గొన్నట్లు అధికారులు చెప్తున్నారు.


మరోవైపు ఉచిత బస్సు పథకం కింద పల్లెల్లో తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటుగా.. నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి బస్సులలోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. గుర్తింపు కార్డులు చూపించి ఈ బస్సులలో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa