అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై భారత్లో చైనా రాయబారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా బెదిరింపుదారుడిలా వ్యవహరిస్తోందని చైనా రాయబారి జు ఫీహాంగ్ మండిపడ్డారు. ఆ దేశం స్వేచ్ఛా వాణిజ్యం నుంచి ప్రయోజనం పొందినప్పటికీ, ఇప్పుడు సుంకాలను ‘బేరసారాలకు ఆయుధంగా’ ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. అయితే, సుంకాల విషయంలో భారత్వైపున చైనా బలంగా నిలబడుతుందని ఫీహాంగ్ ఉద్ఘాటించారు. అంతేకాదు, ఆసియా ఆర్థిక వృద్ధికి రెండు దేశాలు డబుల్ ఇంజన్లు అని ఆయన నొక్కి చెప్పారు.
‘‘చాలాకాలంగా స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా అమెరికా ఎంతో ప్రయోజనం పొందింది... కానీ ఇప్పుడు వివిధ దేశాల నుంచి అధిక ధరలను డిమాండ్ చేయడానికి సుంకాలను బేరసారాలుగా ఉపయోగిస్తోంది. అమెరికా భారత్పై 50% వరకు సుంకాలను విధించింది.. మరిన్ని విధిస్తామని బెదిరించింది. చైనా దీనిని గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఇటువంటి చర్యలకు మౌనంగా ఉంటే బెదిరింపుదారులు మరింత రెచ్చిపోతారు.. ప్రపంచ వాణిజ్యంలో బహుపాక్షిక వ్యవస్థను నిలబెట్టడానికి చైనా భారతదేశంతో దృఢంగా నిలుస్తుంది’’ అని ఫీహాంగ్ అన్నారు.
అంతర్జాతీయ క్రమంలో పెద్ద మార్పు జరుగుతోందని, అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చైనా, భారతదేశం ఐక్యంగా ఉండి, ఒకరితో ఒకరు సహకరించుకోవాలని ఆయన అన్నారు. ‘‘చైనా, భారతదేశం స్నేహం ఆసియాకు ప్రయోజనం చేకూరుస్తుంది.. ఆసియాలో ఆర్థిక వృద్ధికి మనం డబుల్ ఇంజన్లు. భారత్, చైనా ఐక్యత వల్ల ప్రపంచానికి ప్రయోజనం కలుగుతుంది’’ అని చైనా రాయబారి పేర్కొన్నారు. ప్రపంచ స్థిరత్వాన్ని కాపాడుకోడానికి రెండు దక్షిణాసియా దేశాలు సహకరించుకోవడం చాలా అవసరమని జు ఫీహాంగ్ అన్నారు. ‘సమానమైన, క్రమబద్ధమైన బహుళ ధ్రువ ప్రపంచాన్ని ప్రోత్సహించడంలో భారత్, చైనాలు ముందంజ వేయాల్సిన బాధ్యత ఉంది..." అని ఆయన స్పష్టం చేశారు.
భారత్తో వాణిజ్యం గురించి మాట్లాడుతూ.. అన్ని భారతీయ వస్తువులను చైనా మార్కెట్లోకి స్వాగతిస్తున్నామని, రెండు దేశాల మధ్య పరస్పర వ్యూహాత్మక నమ్మకాన్ని పెంపొందించి, పరస్పర అనుమానాన్ని నివారించాలని చెప్పారు. ‘రెండు దేశాలు భాగస్వాములు, ప్రత్యర్థులు కాదు. మనం చర్చల ద్వారా విబేధాలను పరిష్కరించుకోవాలి.. "చైనా మార్కెట్లోకి మరిన్ని భారతీయ వస్తువులను మేము స్వాగతిస్తాం... భారత్ ఐటీ, సాఫ్ట్వేర్, బయో-మెడిసిన్లో పోటీ పడుతుంటే.. చైనీయులు ఎలక్ట్రానిక్ తయారీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, న్యూ ఎనర్జీ రంగాలలో వేగంగా విస్తరిస్తున్నారు’’ అని జు ఫీహాంగ్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa