ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కుండపోత వానలు.. గోదావరి ఉగ్రరూపం, కలెక్టర్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 07:17 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ఏలూరు జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి.. సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. గోదావరి నదిలో అంతకంతకూ వరద పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.


భారీ వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయం ఒక యూనిట్‌గా చేసుకుని 24 గంటలు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు.. వరద స్పందన బృందాలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. వరదలకు సంబంధించి సమాచారాన్ని, పరిస్థితిని పరీవాహక ప్రజలకు అందించాలని తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ హెల్ప్‌లైన్ నంబర్ 91549 70454 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


మరోవైపు.. మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు స్థానికంగా పరిస్థితిని పరిశీలించాలని.. దాన్ని కంట్రోల్‌ రూమ్‌ నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్‌, నీటి పారుదల, వైద్యారోగ్య, అగ్నిమాపక, విద్యుత్‌ శాఖ అధికారులు.. పర్యవేక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు. మండలంలోని వివిధ శాఖల అధికారులతో ఎంపీడీవోలు, తహశీల్దార్లు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండ ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండేలా అధికారులు అలర్ట్ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.


మరోవైపు.. విజయవాడ, గుంటూరులోనూ భారీ వర్షాలకు పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. గుంటూరులో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కురిసిన జోరు వర్షానికి.. విద్యానగర్‌ మెయిన్ రోడ్డు వరదతో నిండిపోయింది. నార్త్ సెంటర్, 3 వంతెనలు, లోతట్టు కాలనీల్లో వర్షం నీరు చేరడంతో మున్సిపల్ అధికారులు అలర్ట్ అయి.. నీటిని దిగువకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో భారీ వర్షానికి.. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి పలు కాలనీలు మునిగిపోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa