ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాహుల్ గాంధీ భేటీ.. పీఎంఓలో 88 నిమిషాల సమావేశం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 08:31 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మధ్య ప్రధానమంత్రి కార్యాలయంలో ( పీఎంఓ ) 88 నిమిషాల సుదీర్ఘ సమావేశం జరిగింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సెక్షన్ 12(3) ప్రకారం.. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) సహా 8 ఇన్ఫర్మేషన్ కమిషనర్ల ఖాళీలు, ఒక విజిలెన్స్ కమిషనర్ నియామకాలపై ఈ ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది.


ప్రస్తుతం సీఐసీలో 30,838 కేసులు పెండింగ్‌లో ఉండగా.. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సీఐసీ పదవి ఖాళీగా ఉంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ మొత్తం 9 నియామకాలను వ్యతిరేకిస్తూ తన అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా సమర్పించారు. ప్రతిపక్ష నేత అభ్యంతరం వ్యక్తం చేయడం సాధారణమే అయినప్పటికీ.. ఈ భేటీ ఇంత సుదీర్ఘంగా జరగడం, అనేక కీలక నియామకాలపై చర్చ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.


కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ).. కేంద్ర విజిలెన్స్ విభాగంలో కీలకమైన ఉన్నత పదవుల నియామకాలపై చర్చించడానికి వీరి మధ్య ఈ సమావేశం జరిగినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పీఎంఓకు చేరుకున్న రాహుల్ గాంధీ.. 1.07 గంటలకు భేటీని ప్రారంభించారు. ఈ చర్చ మొత్తం 88 నిమిషాలు కొనసాగింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. గతంలో ప్రతిపక్ష ప్రతినిధులుగా హాజరైనప్పుడు కూడా నియామక ప్రక్రియలపై అభ్యంతరాలు లేవనెత్తినట్లు వర్గాలు తెలిపాయి.


సెప్టెంబర్ 13వ తేదీన హీరాలాల్ సమరియా పదవీ విరమణ చేసినప్పటి నుంచి.. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం కేవలం ఇద్దరు ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీ మాత్రమే కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 12(3) ప్రకారం.. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకానికి పేర్లను ఎంపిక చేయడానికి ముగ్గురు సభ్యుల సిఫార్సు కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రధానమంత్రి ఉంటారు. ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్రమంత్రితోపాటు.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ఈ కమిటీలో ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa