ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నావ్ అత్యాచార కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు ఇటీవల బెయిల్ మంజూరు చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును.. సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. బాధిత కుటుంబానికి భారీ ఊరట లభించింది. ఈ క్రమంలోనే కుల్దీప్ సెంగార్కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ సందర్భంగా 1997 నాటి ఎల్కే అద్వానీ కేసు తీర్పును సీబీఐ గుర్తు చేయడం గమనార్హం.
ఉన్నావ్ అత్యాచార దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ కేసులో సీబీఐ ఒక కీలకమైన చట్టపరమైన పాయింట్ను తెరపైకి తెచ్చింది. 1997 నాటి ఎల్కే అద్వానీ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని.. ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్లు కాదన్న హైకోర్టు వాదనను సీబీఐ సవాల్ చేసింది. ఇటీవల సెంగార్కు బెయిల్ ఇస్తూ.. అతడు ఎమ్మెల్యే అయినంత మాత్రాన పోక్సో చట్టం కింద పబ్లిక్ సర్వెంట్ (ప్రభుత్వ ఉద్యోగి/ప్రజా సేవకుడు) కేటగిరీలోకి రాడని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అయితే దీన్ని సీబీఐ తీవ్రంగా తప్పుబట్టింది.
అద్వానీ కేసు ప్రస్తావన-సీబీఐ వాదన ఏమిటి?
1997లో రాజకీయ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్లు అవుతారా కాదా అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసి తీర్పునిచ్చింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) అవినీతి నిరోధక చట్టం ప్రకారం కచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ల కిందికే వస్తారని తేల్చి చెప్పింది. అయితే అవినీతి వంటి ఆర్థిక నేరాలకే ఎమ్మెల్యేలను పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణిస్తున్నప్పుడు.. చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడుల వంటి తీవ్రమైన నేరాల విషయంలో వారిని ఆ పరిధి నుంచి ఎలా మినహాయిస్తారు అంటూ ఇప్పుడు సీబీఐ ప్రశ్నిస్తోంది.
చిన్నారులపై జరిగే లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల విషయంలో ప్రజా ప్రతినిధులను ఆ నిర్వచనం నుంచి ఎలా మినహాయిస్తారని సీబీఐ నిలదీసింది. ఈ చట్టాన్ని ఢిల్లీ హైకోర్టు చాలా సంకుచితంగా అర్థం చేసుకుందని.. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి సమాజం పట్ల అధిక బాధ్యత ఉంటుందని గుర్తు చేసింది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే పిల్లల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం ఉద్దేశమే దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఎమ్మెల్యేలు పబ్లిక్ సర్వెంట్లు అవుతారా లేదా అనే రాజ్యాంగపరమైన ప్రశ్నపై సమాధానం ఇవ్వాలని కోరుతూ కుల్దీప్ సెంగార్కు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా సెంగార్ శిక్ష అనుభవిస్తున్నందున.. ప్రస్తుతానికి అతడు జైలులోనే కొనసాగనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa