ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించగా.. మంగళవారం రోజున కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ మంగళవారం రోజున ఉత్తర్వులు విడుదల అయ్యాయి.
అలాగే.. అన్నమయ్య జిల్లా కేంద్రంగా గతంలో రాయచోటి ఉండగా.. ప్రస్తుతం జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ తుది నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అలాగే 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటుగా.. మండలాల సరిహద్దులు కూడా మార్పు చేస్తూ ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ జారీ అయింది. రేపటి నుంచి ( డిసెంబర్ 31) కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య.. 26 నుంచి 28కి పెరగనుంది.
మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏపీలో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా నిలవనుంది. కడప జిల్లాలో ఇప్పటి వరకూ 36 మండలాలు ఉన్నాయి. అయితే కొత్తగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం కింద ఉన్న మండలాలను ప్రభుత్వం కడపలో చేర్చింది. దీంతో కడప జిల్లాలో మండలాల సంఖ్య 40కి చేరింది. ఇక జనాభా విషయానికి వస్తే ఏపీలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా తిరుపతి నిలవనుంది. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపటంతో.. తిరుపతి జిల్లా జనాభా 29.47 లక్షలకు చేరింది. దీంతో రాష్ట్రంలో అత్యధిక జనాభా కల్గిన జిల్లాగా తిరుపతి గుర్తింపు దక్కించుకుంది.
అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని విభజించి..పోలవరం జిల్లా ఏర్పాటు చేశారు. 12 మండలాలు, మూడున్నర లక్షల మంది జనాభాతో పోలవరం జిల్లా.. జనాభా పరంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా నిలుస్తోంది. మరోవైపు మదనపల్లె జిల్లా కేంద్రంగా కొనసాగనున్న అన్నమయ్య జిల్లాలో 24 మండలాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa