డీఎంకే ఎంపీ దయానిధి మారన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర భారతదేశంలో మహిళలను ఇంటికే పరిమితం చేసి వంటగది పనులు చేసుకుని పిల్లలను కనమని చెబుతారని, అక్కడి విద్యా విధానాలు కేవలం హిందీకే ప్రాధాన్యం ఇస్తూ ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. అలాంటి విధానాల వల్లే ఉత్తర రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. ఇంగ్లీష్ చదవకుండా భయపెడితే మనుషులను బానిసలుగా మార్చినట్టే అని ఆయన తీవ్రంగా స్పందించారు.తమిళనాడులో మహిళలకు విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణమని మారన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ద్రావిడ మోడల్ బాలికలు-బాలురు అనే తేడా లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పిస్తోందని, ఇక్కడి విద్యావంతులైన యువత వల్లే ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తమిళనాడుకు వస్తున్నాయని ఆయన వివరించారు. హిందీకి మాత్రమే పరిమితమైన విద్యా విధానం కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం చదవకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, భాషపై ఆంక్షలు అభివృద్ధి మరియు ఉపాధికి అడ్డంకిగా మారుతున్నాయని మారన్ వ్యాఖ్యానించారు. ఈ విధానాలతో తమిళనాడులో అక్షరాస్యత రేటు పెరగడమే కాకుండా మహిళల ఉద్యోగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని ఆయన వెల్లడించారు
.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa