ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాబ్స్ తరహాలోనే డ్రోన్లు కూడా బుక్ చేసుకోవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 08:01 PM

సేద్యంలో సాంకేతికత వినియోగానికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వ్యవసాయంలో టెక్నాలజీని ప్రవేశపెట్టి రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే అన్నదాతలకు డ్రోన్లు అందుబాటులోకి తెస్తోంది. రైతులకు డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే ఆటో, ట్యాక్సీ క్యాబులు బుక్ చేసుకున్న తరహాలోనే రైతులు డ్రోన్లు బుక్ చేసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు.


డ్రోన్ల సాయంతో రైతులు పురుగుల మందులు, ఎరువులను పంటలకు పిచికారీ చేయవచ్చని సూచించారు. ఈ విధానంలో వేగంగా పిచికారీ చేయటంతో పాటుగా ఎరువులు, పురుగుల మందుల వృథా కూడా కావని అన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తే మొక్కలకు నేరుగా పురుగుల మందులు, ఎరువులు చేరతాయని అన్నారు.


మరోవైపు రైతులు డ్రోన్ల సర్వీసులను సులభంగా బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. క్యాబులను బుక్ చేసుకున్నట్లుగా డ్రోన్ల సర్వీసులను కూడా బుక్ చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తమ మొబైల్ ఫోన్ సాయంతో.. యాప్ లేదా కాల్ సెంటర్‌ను సంప్రదించి తమకు కావాల్సిన సమయానికి డ్రోన్లను బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఈ విధానంతో రైతుల సమయం వృథా కాదని.. అలాగే కూలీల అవసరం ఉండదన్నారు.


మరోవైపు వ్యవసాయ రంగంలో కూలీల కొరత వేధిస్తోంది. డ్రోన్ల వినియోగం ద్వారా కూలీల కొరత సమస్యకు చెక్ పడుతుందని అధికారులు చెప్తున్నారు. పొలం విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డ్రోన్లు తక్కువ సమయంలోనే మందులను పిచికారీ చేయగలుగుతాయని చెప్తున్నారు. దీంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు ఉండవని చెప్తున్నాైరు.


ఎందుకంటే పురుగుల మందుల పిచికారీ సమయంలో మందుల ప్రభావం వలన కొన్నిసార్లు రైతులు అస్వస్థతకు గురి అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రైతులు అందరూ డ్రోన్లను ఉపయోగించుకుని.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa