జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తోన్న మరో ‘లేడీ డాన్’ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. ఈశాన్య ఢిల్లీలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఆమెను చూస్తే ఎవరికీ అనుమానం రాదు. బ్యూటీషియన్ కదా అనుకుంటారు. కానీ, రాత్రివేళ భారీ డ్రగ్ సిండికేట్ను ఆమెను శాసిస్తుందంటే ఎవరైనా నమ్ముతారు. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేసే ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని మహిపాల్పుర్ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఇటీవల భారీఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ‘మేడమ్ జహర్’ అనే పేరు కంటబడింది . తీగలాగితే డొంక కదిలినట్టు ఆ పేరు కోసం ఆరాతీయగా ఈ లేడీ డాన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈశాన్య ఢిల్లీలో బ్యూటీపార్లర్ నడుపుతున్న ఖుస్నుమానే ‘మేడమ్ జహర్’ అని గుర్తించారు. బిష్ణోయ్, హషీమ్ బాబా గ్యాంగులకు ఆయుధాలు సరఫరా చేసే బాబీ కబూతర్కు ఈమే స్నేహితురాలని వెల్లడయ్యింది.
గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున బెదిరింపులు, దోపిడీలు, కిడ్నాప్లు, హత్యలు, డ్రగ్స్ సిండికేట్ను నిర్వహిస్తోంది బ్యూటీపార్లర్ ముసుగులో పగలు సాధారణగా కన్పిస్తూ.. రాత్రివేళ చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఈమెను డ్రగ్ డీలర్లు ‘మేడమ్ జహర్’ అని పిలుస్తారని గుర్తించారు. జహర్ అంటే విషం అని అర్థం. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఖుస్నుమా అన్సారీ ఆటకట్టించారు. ఖుస్నుమా, ఆమె స్నేహితుడు బాబీ కబూతర్, మరో ఇద్దర్ని అరెస్ట్ చేవారు.
బాబీ కబూతర్ అసలు పేరు మహ్ఫూజ్. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న అక్రమ ఆయుధాల డీలర్ సలీమ్ పిస్టోల్ నుంచి అతడు ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. మూడేళ్ల కిందట పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, గతేడాది ముంబయిలో నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు అతడు సమకూర్చిన ఆయుధాలనే వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఇదిలా ఉండగా, గ్యాంగ్స్టర్ల కోసం పనిచేసిన లేడీ డాన్లు పూజా శర్మ, అలియాస్ దీప, జోయా ఖాన్లను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
దేశంలో ఇప్పటి వరకూ వ్యవస్థీకృత నేరాలకు పురుషులే నాయకత్వం వహిస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో బిష్ణోయ్ నెట్వర్క్, దాని అనుబంధ ముఠాల్లో మహిళలే చురుకుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులు వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్లోని ఝన్ఝూన్కు చెందిన పూజాశర్మను 2 మార్చి 2024న ఛండీగఢ్లో అరెస్ట్ చేశారు. ఆమె చేతిపై ఉన్న ఏకే 47 ట్యాటూ గురించి పోలీసులు ప్రశ్నించగా.. తాను గ్యాంగ్స్టర్ కావాలనుకున్నట్టు వెల్లడించారు. వివాహం తర్వాత భర్తతో విబేధాల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చి, రాకేశ్ అనే క్రిమినల్ ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో చేరింది.
ఇక, జోయా ఖాన్.. బిష్ణోయ్ సిండికేట్లోని కీలక సభ్యుడైన హషీమ్ బాబా భార్య. గతేడాది ఆమె రూ.కోటి విలువైన డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్కు చెందిన మరో మహిళ జిక్రాకు హషీం బాబా వర్గంతో సంబంధం ఉంది. అలాగే, రాజస్థాన్లోని సికర్కు చెందిన బీసీఏ గ్రాడ్యుయేట్ అయిన అనురాధా చౌధురి అలియాస్ మేడమ్ మింజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa