ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రతా బలగాలు విషపూరిత తూటాలు వాడుతున్నాయని మావోయిస్టుల ఆరోపణ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 06:52 AM

మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో భద్రతా బలగాలు అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలు ప్రయోగిస్తున్నాయా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో విషపూరిత షెల్స్‌ వాడారని మావోయిస్టు పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటన నుంచి బయటపడిన ఓ మావోయిస్టు అగ్రనేత 'ఫినిక్స్‌' పేరుతో రాసిన ఓ రిపోర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.గతేడాది ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లా కుల్హదీఘాట్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ, సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. సుమారు 48 గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి సహా 16 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టు నేత, పార్టీకి పంపిన నివేదికలో సంచలన విషయాలు పేర్కొన్నారు. బలగాలు తమపై తీవ్రమైన షెల్లింగ్‌కు పాల్పడ్డాయని, ఆ ముక్కలు తగిలిన సహచరులు కేవలం గాయాలతోనే కాకుండా భరించలేని మంట, నొప్పితో విలవిల్లాడారని తెలిపారు. తీవ్రమైన దాహం, వాంతులతో నరకయాతన అనుభవించారని ఆ రిపోర్టులో వివరించారు.గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్న ఈ నివేదికను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందం పై భారత్ సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa