ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొజ్తబా ఖమేనీకి వంధ్యత్వం.. నాలుగుసార్లు లండన్‌లో చికిత్స తర్వాత పుట్టిన కొడుకు.. ఇటీవలి దాడుల్లో మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:16 PM

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఖమేనీ అల్లుడు, కుమార్తె, కోడలు, మనవడు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఖమేనీ భార్య సైతం చనిపోయారని వార్తలొచ్చాయి. ఖమేనీ మరణించిన తర్వాత.. ఆయన రెండో కుమారుడైన మోజ్తబా ఖమేనీ (56) తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మోజ్తబా ఖమేనీకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికిలీక్స్ విడుదల చేసిన పత్రాల ప్రకారం.. ఆయన వంధ్యత్వ (సంతానలేమి) సమస్యకు చికిత్స పొందారని తెలుస్తోంది. అందువల్లే ఆయన వివాహాన్ని ఆలస్యం చేశారని.. తండ్రి కావడానికి ముందు యూకే వెళ్లి వైద్యం చేయించుకున్నారని వీక్ లీక్స్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.


 ‘వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకపోవడంతో మోజ్తబా దంపతులు ఇబ్బందిపడ్డారు. వారసుడు కావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో మోజ్తబా చికిత్స కోసం లండన్‌లోని వెల్లింగ్టన్, క్రామ్‌వెల్ ఆసుపత్రులను మూడుసార్లు సందర్శించారు. నాలుగోసారి లండన్ వెళ్లి రెండు నెలలపాటు చికిత్స పొందిన తర్వాత ఆయన వంధ్యత్వ సమస్య పరిష్కారమైంది. ఇరాన్ తిరిగి వచ్చిన తర్వాత 2008లో ఆయన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చారు’ అని వికీలీక్స్ డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది.


మాజీ మజ్లిస్ స్పీకర్ హదాద్ అదెల్ కుమార్తె జహ్రాను మోజ్తబా 2004లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన షియా సంప్రదాయం ప్రకారం రెండు తాత్కాలిక వివాహాలు చేసుకున్నారు. కానీ లైంగిక సమస్యతో బాధపడిన మొజ్తబా.. కుటుంబం ఒత్తిడి మేరకు లండన్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం మొజ్తబా దంపతులు ఇరాన్‌ వచ్చాక కుమారుడు అలీ పుట్టాడు. మొజ్తబా తన తండ్రి పేరునే కొడుక్కి పెట్టారు. అయితే, ఆయన ఎలాంటి చికిత్స పొందారు? ఆయనకు ఎంత మంది సంతానం ఉన్నారనే విషయాన్ని మాత్రం డాక్యుమెంట్లలో వెల్లడించలేదు. అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన 49 మందిలో మొజ్తబా భార్య, కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వివరాలను ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఖమేనీ అంత్యక్రియలను సైతం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.


మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా తన తండ్రి స్థానంలో నియమితులు కానున్నారని ఇజ్రాయెలీ మీడియా ఇటీవల వెల్లడించింది. మరికొద్ది గంటల్లోనే మొజ్తబాను వారసుడిగా అసెంబ్లీ అధికారికంగా ప్రకటించనుందని సీనియర్ అధికారులు తెలిపినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. అయితే ముంబైలోని కాన్సులేట్ జనరల్ ద్వారా ఇరాన్ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa