కొత్త స్కూటర్‌..రూ.1.25 లక్షలలోపే?

షేర్ చేయండి:

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో ఏథర్‌ ఎనర్జీ కొత్త అడుగు వేస్తోంది. ఇప్పటివరకు ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత స్కూటర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు సామాన్య వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇందులో భాగంగా ‘కోనార్క్‌’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తీసుకొస్తోంది. ఆగస్టు 29న అధికారికంగా ఆవిష్కరించనుంది.

ఈ స్కూటర్‌లో మెటల్‌ బాడీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏథర్‌ ఉత్పత్తుల్లో మెటల్‌ ప్యానెళ్లను ఉపయోగిస్తున్న తొలి స్కూటర్‌ ఇదే. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్‌ మెహతా టీజర్‌ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

కోనార్క్‌ను ఏథర్‌ రిజ్టా, 450 సిరీస్‌ కంటే దిగువన తీసుకురానుంది. టీవీఎస్‌ ఐక్యూబ్‌, బజాజ్‌ చేతక్‌, ఓలా ఎస్‌1 ఎక్స్‌ వంటి స్కూటర్లకు ఇది పోటీ ఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. దీని ధర రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అయితే అధికారిక ధరలను ఆగస్టు 29న ప్రకటించనున్నారు.

ఏథర్‌ కొత్తగా అభివృద్ధి చేసిన ‘ఈఎల్‌ ప్లాట్‌ఫామ్‌’పై తయారవుతున్న తొలి ఉత్పత్తి కోనార్క్‌. అందుబాటు ధర, సౌకర్యం, తక్కువ నిర్వహణ వ్యయం, రోజువారీ వినియోగానికి అనువుగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.

డిజైన్‌ విషయానికి వస్తే.. ముందు భాగంలో హ్యాండిల్‌బార్‌ దగ్గర హెడ్‌ల్యాంప్‌, వెడల్పైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ ఉన్నాయి. 14 అంగుళాల ముందు చక్రం, 12 అంగుళాల వెనుక చక్రం ఉంటాయి. పొడవైన సింగిల్‌ సీట్‌, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్‌, నిటారుగా కూర్చునే రైడింగ్‌ పొజిషన్‌ ఉంటాయి.

బ్యాటరీ సామర్థ్యం, పనితీరు, ఫీచర్లు, పూర్తి స్పెసిఫికేషన్లు, డెలివరీ వివరాలను ఆగస్టు 29న వెల్లడించే అవకాశం ఉంది.