కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు

షేర్ చేయండి:

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్నత విద్య సామాన్యులకు భారంగా మారుతోందని, ప్రముఖ విద్యాసంస్థలన్నీ క్రమంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు పేపర్ లీకేజీలు, రిక్రూట్‌మెంట్ పరీక్షల కుంభకోణాలే స్వాగతం పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరి వల్ల యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.


పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా యువత లేవనెత్తిన అసలైన సమస్యలకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని ఖర్గే విమర్శించారు. యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ 'విద్య నుంచి ఉపాధి వరకు రోడ్‌మ్యాప్'ను రూపొందించాల్సి ఉందన్నారు. అలాగే అయోధ్య రామాలయం విరాళాల చోరీ వివాదంపై స్పందిస్తూ, నిధుల గోల్‌మాల్‌పై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులను జవాబుదారీ చేయాలని డిమాండ్ చేశారు.