యూకేకు తిరిగొస్తున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్

Select Suryaa Now

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మర్కెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్ల క్రితం అమెరికాకు మకాం మార్చిన ఈ జంట, మళ్లీ యూకేకు తిరిగి రావాలని నిశ్చయించుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ నెలలోనే వారు తమ పిల్లలతో కలిసి యూకేకు రానున్నట్లు సమాచారం.

డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ తమ నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి లండన్ వెలుపల ఉన్న ఓ ప్రైవేట్ నివాసానికి మార్చనున్నారు. వారి పిల్లలు, ఏడేళ్ల ప్రిన్స్ ఆర్చి, ఐదేళ్ల ప్రిన్సెస్ లిలిబెట్.. సెప్టెంబర్ నుంచి బ్రిటన్‌లోని ఓ స్కూల్‌లో తమ చదువును ప్రారంభించనున్నారు. అయితే, హ్యారీ దంపతులు రాచరిక విధులను చేపట్టబోరని స్పష్టమైంది. 2020లో కుదిరిన ఒప్పందం ప్రకారం వారు 'నాన్-వర్కింగ్ రాయల్స్'గా, అంటే ప్రైవేట్ పౌరులుగానే తమ జీవితాన్ని కొనసాగిస్తారు.

తమ నిర్ణయాన్ని ప్రిన్స్ హ్యారీ ఆగస్టు 16న తండ్రి కింగ్ చార్లెస్ IIIకి తెలియజేశారు. తన కుమారుడి కుటుంబాన్ని తరచుగా కలుసుకునే అవకాశం లభిస్తున్నందుకు రాజు చార్లెస్ వ్యక్తిగతంగా సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేథరిన్‌లకు కూడా తెలియజేశారు.

హ్యారీ దంపతులు కాలిఫోర్నియా, పోర్చుగల్‌లోని తమ ఇళ్లను అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. ఈ వార్త వెలువడినప్పటికీ, రాచరిక విధుల్లో లేని వారి వ్యక్తిగత విషయాలపై తాము వ్యాఖ్యానించబోమని బకింగ్‌హామ్ ప్యాలెస్ తన విధానాన్ని స్పష్టం చేసింది.