అప్పుల్లో అమెరికా ప్రమాదంలో ఆర్థిక వ్యవస్థ

Select Suryaa Now

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశ జాతీయ అప్పు బుధవారం నాటికి 40 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 38.23లక్ష‌ల కోట్లు) రికార్డు స్థాయిని దాటింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని ఇది స్పష్టం చేస్తోంది. పెరుగుతున్న రక్షణ వ్యయాలు, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి సంక్షేమ పథకాలకు చేస్తున్న భారీ కేటాయింపులు, లోటు బడ్జెట్‌పై చెల్లిస్తున్న వడ్డీల కారణంగా అప్పుల భారం అనూహ్యంగా పెరిగిపోతోంది.

అప్పులు పెరుగుతున్న వేగం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఐదు నెలల క్రితం మార్చిలో అమెరికా అప్పు 39 ట్రిలియన్ డాలర్లకు చేరగా, అంతకుముందు ఐదు నెలల క్రితం అక్టోబర్‌లో 38 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. అంటే, ప్రతి ఐదు నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున అప్పు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు ఆరు నెలలుగా ఇరాన్‌తో చేస్తున్న యుద్ధానికి రక్షణ వ్యయాన్ని పెంచుతూ, మరోవైపు గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు ప్రయత్నించడం వంటి విభిన్న ప్రాధాన్యతలు కూడా ఈ పరిస్థితికి కారణంగా నిలుస్తున్నాయి.

అయితే, వ్యర్థ ఖర్చులను తగ్గించి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా అప్పు-జీడీపీ నిష్పత్తిని సరైన మార్గంలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు.

మరోవైపు, పెరుగుతున్న అప్పుల ప్రభావం ఇప్పటికే అమెరికన్ల జీవితాలపై పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, వ్యాపార సంస్థల పెట్టుబడులు తగ్గడంతో వేతనాలు క్షీణించడం, వస్తు సేవల ధరలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

"ప్రస్తుత ఆర్థిక మార్గం ఏమాత్రం నిలకడలేనిది. కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించే అంతరాయాలు, ఆర్థిక మాంద్యం, ప్రపంచ యుద్ధం వంటి ఏదైనా ఊహించని ఘటన జరిగితే, ఈ సవాలు పూర్తిస్థాయి సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది" అని బైపార్టిసన్ పాలసీ సెంటర్ ప్రెసిడెంట్ మార్గరెట్ స్పెల్లింగ్స్ హెచ్చరించారు.

ప్రస్తుతం అమెరికా రుణ పరిమితి 41.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పరిమితికి 2027 నాటికి చేరుకునే అవకాశం ఉందని, అప్పుడు కాంగ్రెస్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికా ఆర్థిక పరిస్థితే అత్యంత బలహీనంగా ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ఇటీవలి విశ్లేషణలో పేర్కొనడం గమనార్హం.