ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే.. ఆయా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తున్నారనేది చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే ఏ అభ్యర్థి గెలుస్తాడోనని అటు పార్టీలు, తమ నియోజవర్గంలో ఎలాంటి నాయకుడు నిలబడుతున్నాడోనని ఇటు ఓటర్లు.. ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అయితే గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీలు చూస్తూ ఉంటాయి. డబ్బు, కులం, పేరు, పలుకుబడి చూసి పార్టీలు టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ శాసనసభలోని ప్రస్తుత ఎమ్మెల్యేలలో 186 మంది అంటే 81 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు.
ఆయా ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సగటున రూ. 10.76 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని తెలిపింది. ఇది గతంలో 2013 లో ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 5.25 కోట్ల కన్నా 105 శాతం ఎక్కువ అని వెల్లడించింది. 2008 లో ఎన్నికైన ఎమ్మెల్యే సగటు రూ. 1.44 కోట్ల కన్నా 647 శాతం ఎక్కువ అని తెలిపింది. 230 మందిలో సగం మంది బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని పేర్కొంది.
మధ్యప్రదేశ్లో బీజేపీకి ఉన్న 129 మంది ఎమ్మెల్యేలలో 107(83శాతం) మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ తెలిపింది. ఇక 97 మంది ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 76 (78 శాతం) మంది కోటీశ్వరులేనని చెప్పింది. నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ముగ్గురు కోటీశ్వరులే ఉండటం గమనార్హం. మరోవైపు.. మధ్యప్రదేశ్లో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన మాజీమంత్రి, సంజయ్ పాఠక్ నిలిచారు. 2013లో సంజయ్ పాఠక్కు రూ. 141 కోట్ల ఆస్తులు ఉండగా.. అవి 2018 నాటికి 60 శాతం పెరిగి రూ. 226 కోట్లకు చేరుకున్నాయి. ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఆరో స్థానంలో రూ.124 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కేవలం రూ. 7 కోట్ల ఆస్తులు మాత్రమే కలిగి ఉన్నారు. కేవలం రూ. 50 వేల ఆస్తితో బీజేపీకి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామ్ దంగోర్ అత్యంత పేద ఎమ్మెల్యేగా ఉన్నారు. 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 30 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. 97 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 54 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa